ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న ఉపాసన

5 Oct, 2019 10:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ ఎంతో మందికి అండగా నిలుస్తున్న వ్యాపారవేత్త, సినీ హీరో రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకున్నారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటి నాయకత్వ విభాగంలో మహాత్మా గాంధీ అవార్డు సొంతం చేసుకున్నారు. గాంధీజీ 150వ జయంతి సందర్భంగా అవార్డు అందుకున్న విషయాన్ని ఉపాసన తాజాగా సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు... ‘ఇతరులకు సేవ చేయడం ద్వారా.. నిన్ను నువ్వు కోల్పోయే క్రమమే.. నిజమైన నిన్ను కనుగొనే అత్యుత్తమ మార్గం. మహాత్మా గాంధీ అవార్డు అందించినందుకు ధన్యవాదాలు. ఈ గాంధీ జయంతి మా కుటుంబానికి నూతనోత్సాహాన్ని ఇచ్చింది. సైరా నరసింహారెడ్డి మీద ప్రేమ కురిపిస్తున్నందుకు కృతఙ్ఞతలు’ అని ఉపాసన ట్వీట్‌ చేశారు.

కాగా అపోలో హాస్పిటల్స్‌కు సంబంధించిన హెల్త్‌కేర్‌ విభాగంలో ఉపాసన కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా పలు సామాజిక కార్యక్రమాల్లోనూ ఆమె ముందుంటారు. ఇక తన భర్త రామ్‌చరణ్‌కు సంబంధించిన ప్రతీ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటూ అభిమానులను ఖుషీ చేస్తారన్న సంగతి తెలిసిందే. కాగా రామ్‌చరణ్‌ నిర్మాణంలో చిరంజీవి ప్రధాన పాత్రలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా విశ్వరూపం ప్రదర్శించిన చిరంజీవి నటనకు అభిమానులు నీరాజనాలు పడుతుండగా.. నిర్మాతగా రామ్‌చరణ్‌ మరో సక్సెస్‌ అందుకోవడంతో మెగా ఫ్యామిలీ సంబరాల్లో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే.


మరిన్ని వార్తలు