పసిడి ధరలు పటిష్టమే..!

26 Aug, 2019 05:13 IST|Sakshi

అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యం

వారంవారీగా 16 డాలర్లు పెరిగి 1,537 డాలర్లకు చేరిక

త్వరలో  1,600 డాలర్లకు చేరే చాన్స్‌

న్యూఢిల్లీ/న్యూయార్క్‌: పసిడి బులిష్‌ ట్రెండ్‌ కనబడుతోంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితి .. ప్రత్యేకించి అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రత, ఈక్విటీ మార్కెట్ల బలహీనత, అమెరికా ఆర్థికాభివృద్ధి మళ్లీ మాంద్యంలోకి జారిపోతుందన్న అంచనాలు, దీనితో వడ్డీరేట్ల తగ్గింపునకే ఫెడ్‌ మొగ్గు చూపిస్తుందన్న విశ్లేషణలు పసిడికి బలాన్ని ఇస్తున్నాయి. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు పసిడిని ఒక తక్షణం ఒక సురక్షిత సాధనంగా ఎంచుకుంటున్నారు. అమెరికాపై చైనా ప్రతీకార టారిఫ్‌ల నేపథ్యంలో– శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ఔన్స్‌ (31.1గ్రా) ఒకేరోజు 28 డాలర్లు ఎగిసి 1,537 డాలర్లకు పెరిగింది.

ఇది వారం వారీగా 16 డాలర్ల పెరుగుదల.  1,546 డాలర్లు ఈ ఏడాది గరిష్టం కావడం గమనార్హం. 1,360 డాలర్ల కీలక నిరోధాన్ని దాటిన తర్వాత పసిడి వేగంగా 1,546 స్థాయిని తాకిన సంగతి తెలిసిందే. రానున్న వారం రోజుల్లో పసిడి 1,600 డాలర్ల స్థాయిని చేరడం ఖాయమన్న అభిప్రాయం ఉంది.  ఇక దేశీయంగా చూసినా పసిడి రికార్డులు సృష్టిస్తోంది. అంతర్జాతీయంగా పసిడి బలపడ్డంతోపాటు, డాలర్‌ మారకంలో రూపాయి (శుక్రవారం 71.66 వద్ద ముగింపు)బలహీన ధోరణి కూడా దేశీయంగా పసిడికి కలిసివస్తోంది. దేశీయంగా ఫ్యూచర్స్‌ మార్కెట్‌– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌ ఎంసీఎక్స్‌లో పసిడి ధర 10 గ్రాములకు రూ.38,765 వద్ద ఉంది.   

మరిన్ని వార్తలు