యుటిలిటీ దిగ్గజం మారుతీ!

19 Apr, 2018 06:13 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ ‘మారుతీ సుజుకీ’ తాజాగా దేశీ యుటిలిటీ వాహన విభాగంలో మార్కెట్‌ లీడర్‌గా అవతరించింది. 2017–18లో 27.5 శాతానికిపైగా వాటాను ఆక్రమించామని మారుతీ సుజుకీ ప్రకటించింది. వితారా బ్రెజా, ఎర్టిగా, ఎస్‌–క్రాస్‌ మోడళ్లలోని బలమైన విక్రయాలు ఈ మైలురాయిని చేరుకోవడానికి ప్రధాన కారణమని పేర్కొంది. కాగా 2017–18లో కంపెనీ యుటిలిటీ వాహన అమ్మకాలు 2,53,759 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇదివరకటి సంవత్సరంలోని 1,95,741 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే 29.6 శాతం వృద్ధి కనిపించింది.

యుటిలిటీ వాహన పోర్ట్‌ఫోలియోను క్రమంగా విస్తరించుకుంటూ వస్తున్నామని మారుతీ సుజుకీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌) ఆర్‌.ఎస్‌.కల్సి తెలిపారు. ‘ప్రతి ప్రొడక్టు ప్రత్యేకమైనదే. వీటి ద్వారా కస్టమర్ల డబ్బులకు విలువ చేకూర్చుతున్నాం’ అని పేర్కొన్నారు. 2017–18లో వితారా బ్రెజా విక్రయాల్లో 36.7 శాతం, ఎస్‌–క్రాస్‌ అమ్మకాల్లో 44.4 శాతం, ఎర్టిగా విక్రయాల్లో 4.1 శాతం వృద్ధి నమోదయ్యిందని తెలిపారు.    

మరిన్ని వార్తలు