రుణాలు చెల్లించలేకపోవడానికి నోట్ల రద్దే కారణం

13 Jun, 2018 00:33 IST|Sakshi

2జీ స్కామ్‌లో సుప్రీం తీర్పు, బ్రెజిల్‌ ప్రభుత్వాలదీ పాత్రే

ఎన్‌సీఎల్‌టీకి వీడియోకాన్‌ న్యాయవాది వివరణ

న్యూఢిల్లీ: బ్యాంకులకు సుమారు రూ.20,000 కోట్ల వరకు రుణ బకాయి పడి, చెల్లింపుల్లో విఫలమైన వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌ ఎన్‌సీఎల్‌టీ ముందు కొత్త వాదనలు వినిపించింది. తమ కంపెనీ వ్యాపారం దెబ్బతిని రుణాలు చెల్లించలేకపోవడానికి మోదీ సర్కారు నోట్ల రద్దు, 2జీ స్కామ్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, బ్రెజిల్‌ ప్రభుత్వాల పాత్రను వీడియోకాన్‌ తరఫు న్యాయవాది వినిపించారు.

కంపెనీకి వ్యతిరేకంగా దివాలా చర్యలను కోరుతూ ఎస్‌బీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్‌ గత వారం ఆమోదించిన విషయం తెలిసిందే. గతంలో సమయానికి రుణ చెల్లింపులు చేసిన చరిత్ర కంపెనీకి ఉందని, ప్రస్తుతం చెల్లింపుల్లో విఫలం అవడానికి ఊహించని పరిస్థితులే కారణమని వీడియోకాన్‌ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ‘‘మోడీ ప్రభుత్వం తీసుకున్న డీమోనిటైజేషన్‌ నిర్ణయం మా సీఆర్‌టీ టెలివిజన్ల వ్యాపారాన్ని ముంచేసింది.

సరఫరాదారులు ముడి సరుకులను సరఫరా చేయలేకపోయారు. దీంతో ఆ వ్యాపారం గణనీయంగా తగ్గిపోవడంతో మూసేయాల్సి వచ్చింది’’ అని కోర్టుకు తెలిపారు. ఇక, 2012లో సుప్రీంకోర్టు 100కుపైగా 2జీ లైసెన్స్‌లను రద్దు చేసిందని, అందులో వీడియోకాన్‌ లైసెన్స్‌లు 21 వరకు ఉండటంతో భారీగా నష్టపోవాల్సి వచ్చిందని, బ్యాంకులకు చెల్లింపులు చేయలేకపోయినట్టు వివరించారు. బ్రెజిల్‌ పెట్రోలియంతో కలసి జాయింట్‌ వెంచర్‌ కింద ఆయిల్, గ్యాస్‌ వ్యాపార నిర్వహణకు అక్కడి ప్రభుత్వ అనుమతిలో జాప్యం చేయడంతో నష్టాలు వచ్చినట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు