మాల్యాకు డీఆర్‌టీ మరో షాక్‌...

28 Mar, 2019 00:06 IST|Sakshi

రూ.1,008 కోట్ల విలువైన యూబీహెచ్‌ఎల్‌ షేర్ల విక్రయం

విజయ్‌మాల్యా రుణాల రికవరీలో ముగిసిన తొలిఘట్టం 

న్యూఢిల్లీ:  బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్తుడు, కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ అధినేత విజయ్‌ మాల్యా యునైటెడ్‌ బ్రేవరీస్‌ హోల్డింగ్స్‌  (యూబీహెచ్‌ఎల్‌)కు చెందిన 74 లక్షల షేర్లను రూ. 1,008 కోట్లకు ఈడీ విక్రయించింది. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) బుధవారం మీడియాకు వెల్లడించింది. విజయ్‌ మాల్యాపై మనీ లాండరింగ్‌ విచారణలో భాగంగా ఈడీ ఈ షేర్లను అటాచ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈడీ అటాచ్‌లో ఉన్న ఈ షేర్లు డెబిట్‌ రికవరీ ట్రిబ్యునల్‌ (డీఆర్‌టీ)కు వెళ్లాయి. ఈ నెల తొలి వారంలోనే డీఆర్‌టీ ఆదేశించిన మేరకు యూబీహెచ్‌ఎల్‌కు చెందిన 74,04,932 షేర్లను విక్రయించింది.

ఈడీ సమర్పించిన పత్రాలు, తీసుకున్న చర్యల ఆధారంగాను, ఎస్‌బీఐ కన్సార్టియంకు విజయ్‌ మాల్యా భారీమొత్తంలో రుణాలు బాకీ ఉన్న కారణంగాను ఈ షేర్లను అమ్మేందుకు అక్రమ నగదు రవాణా నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కోర్టు ఈనెల 26న అనుమతినిచ్చింది. దీంతో బుధవారం డీఆర్‌టీకి చెందిన రికవరీ అధికారి ఈ షేర్లను రూ. 1008 కోట్లకు విక్రయించారు. విజయ్‌ మాల్యా రుణాల రికవరీ ప్రక్రియలో ఇది తొలి ఘట్టమేనని, మరికొద్ది రోజుల్లో మిగిలినవి కూడా విక్రయిస్తామని డీఆర్‌టీ అధికారులు తెలిపారు. 

మరిన్ని వార్తలు