అరెస్ట్‌కు దారితీసిన మాల్యా 12 ఏళ్ల ప్రయాణం

19 Apr, 2017 00:31 IST|Sakshi
అరెస్ట్‌కు దారితీసిన మాల్యా 12 ఏళ్ల ప్రయాణం

యూబీ గ్రూప్‌ మాజీ అధిపతి విజయ్‌ మాల్యా లండన్‌లో అరెస్ట్‌కు దారితీసిన ఆయన పన్నెండేళ్ల వ్యాపార, బ్యాంక్‌ లావాదేవీలు, నేరాభియోగాలపై చట్టాలు అమలుచేసే ప్రభుత్వ సంస్థల చర్యలు క్లుప్తంగా...

  • 2005: యునైటెడ్‌ బ్రూవరీస్‌(హోల్డింగ్స్‌)లి. చైర్మన్‌ హోదాలో మాల్యా కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌(కేఎఫ్యే) ఏర్పాటు చేసి ప్రపంచస్థాయి విమానయాన సంస్థగా ఇది ఎదుగుతుందనే భారీ ప్రచారం.
  • 2006: విమానాల కొనుగోలుకు ఐడీబీఐ బ్యాంక్‌కు రుణం కోసం కింగ్‌ఫిషర్‌ దరఖాస్తు చేయగా, యూబీ గ్రూపుతో పాత అనుభవాల దృష్ట్యా అందుకు ‘నో’చెప్పిన ప్రభుత్వరంగ బ్యాంకు. ఇతర బ్యాంకులతో మాట్లాడి రుణాలు సాధించడంలో  మాల్యా విజయం.
  • 2007: దాదాపు దివాలాతీసిన ఎయిర్‌ డక్కన్‌లో వాటా తీసుకోవడానికి  కింగ్‌ఫిషర్‌ నిర్ణయం.
  • 2008: ఎయిర్‌డక్కన్‌లో 26 శాతం వాటా కొనుగోలుకు యునైటెడ్‌ బ్రూవరీస్‌ రూ.550 కోట్లు చెల్లించింది. మార్చినాటికి ఈ అప్పులు రూ. 934 కోట్లకు పెరగగా, సెప్టెంబర్‌లో బెంగళూరు–లండన్‌ సర్వీసుతో, కింగ్‌ఫిషర్‌ అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించింది.
  • 2009: ఫలితంగా కింగ్‌ఫిషర్‌ రుణాలు రూ.5,665 కోట్లకు పెరిగి, వేగంగా ఏడువేల కోట్లకు చేరాయి. మొదట అప్పివ్వడానికి నిరాకరించిన ఐడీబీఐ బ్యాంక్‌ ఈ ఎయిర్‌లైన్స్‌కు రూ.900 కోట్లరుణం ఇవ్వాలని నిర్ణయిస్తుంది.
  • 2010: రుణాలు 9 నెలల్లో తిరిగి చెల్లించాలని అన్ని బ్యాంకులూ కింగ్‌ఫిషర్‌కు గడువు విధించాయి. అప్పటికి రాజ్యసభ సభ్యుడు కూడా అయిన మాల్యా రుణాలు చెల్లించడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, భారీ ఖర్చుతో కూడిన జీవనశైలిని కొనసాగించారు.
  • 2011–12: కింగ్‌ఫిషర్‌లో తన వేతనం కింద ఏటా రూ.36 కోట్ల చొప్పున భారీ మొత్తాన్ని మాల్యా తీసుకుంటూనే ఉన్నారు. విమానాలు నడిపే లైసెన్స్‌ను ప్రభుత్వం తాత్కాలికంగా రద్దుచేయడంతో, సిబ్బందికి జీతాలు చెల్లించలేని స్థితికి కింగ్‌ఫిషర్‌ ఎదుర్కొంది. 2016 మార్చి నాటికి మూడు వేలమంది సిబ్బందికి చెల్లించాల్సిన వేతనాలు రూ.3000 కోట్లకు దాటిపోయాయి. ఎస్‌బీఐ, ఐడీబీఐ వంటి బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాల మొత్తం వంద కోట్ల డాలర్లకు మించిపోయింది.
  • 2013: ఈ ఎయిర్‌లైన్స్‌కు ఇచ్చిన రూ.6,493 కోట్ల రుణాలను తిరిగి చెల్లించాలంటూ స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహా అప్పులిచ్చిన బ్యాంకుల కన్సార్షియం యునైటెడ్‌ బ్యూవరీస్‌(హో)లిమిటెడ్‌ను కోరగా, అత్యధిక భాగం రుణాన్ని త్వరలో చెల్లిస్తానని మాల్యా హామీ ఇచ్చారు.
  • 2014: ఎయిర్‌లైన్స్‌ కోసం భారీగా అప్పుచేసి, బాకీ కట్టని మాల్యాను ‘ఉద్దేశపూర్వక ఎగవేతదారు’గా మొదట యునైటెడ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించగా, ఎస్‌బీఐ, పంజాబ్‌నేషనల్‌ బ్యాంక్‌ కూడా అదే ముద్ర ఆయనకు వేశాయి.
  • 2016: యునైటెడ్‌ స్పిరిట్స్‌ లిమిటెడ్‌ డైరెక్టర్ల బోర్డు మాల్యాను రాజీనామా చేయాలని ఫిబ్రవరిలో కోరుతుంది. మాల్యాను దేశం నుంచి పారిపోకుండా ఆపాలని సుప్రీంకోర్టును కింగ్‌ఫిషర్‌కు రుణాలిచ్చిన బ్యాంకులు కోరతాయి. అప్పటికే మాల్యా ఇండియా వదలి లండన్‌కు పారిపోయిన విషయం వెల్లడయింది.అనేక పెండింగ్‌ కేసులకు సంబంధించి హాజరుకాలేదనే కారణంపై స్పెషల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు మాల్యాకు నాన్‌బెయిలబుల్‌ వారంట్‌ జారీచేస్తుంది. 2002 ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ చట్టంకింద మరో నాన్‌బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేయాలని ప్రత్యేక న్యాయస్థానాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కోరింది. అప్పటికే మాల్యా విదేశాలకు 59 కోట్ల డాలర్లు రహస్యంగా తరలించారని వార్తలొచ్చాయి.
  • 2017: నిష్పాక్షిక విచారణ జరపకుండానే తనను నరేంద్ర మోదీ ప్రభుత్వం తనను దోషిగా నిరూపించాలనే పట్టుదలతో ఉందని మాల్యా మార్చి నెలలో ఆరోపిస్తారు. విజయ్‌ మాల్యాను పంపిచాలని కోరుతూ ఇండియా చేసిన అభ్యర్థనను బ్రిటన్‌ సర్కారు ఓ ఇంగ్లండ్‌ కోర్టుకు అందజేస్తుంది. ఏప్రిల్‌లో గోవాలోని మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్‌ విల్లాను వేలం వేసిన కొన్ని రోజులకే లండల్‌లో మాల్యా అరెస్ట్‌–విడుదలతో కింగ్‌ఫిషర్‌ వ్యవహారం కీలక దశకు చేరినట్టయింది.

(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)
 

మరిన్ని వార్తలు