మాల్యా అప్పగింతపై విచారణ ప్రారంభం

4 Dec, 2017 09:00 IST|Sakshi

బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టి, యూకేలో విలాసవంతమైన జీవితం గడుపుతున్న లిక్కర్‌ టైకూన్‌ విజయ్‌ మాల్యాను భారత్‌కు అప్పగింత కేసు విచారణ నేటి నుంచి ప్రారంభం కాబోతుంది. వచ్చే 10 రోజుల వరకు వెస్ట్‌మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు చీఫ్‌ మెజిస్ట్రేట్‌ ఎమ్మా అర్బత్నోట్ ఈ కేసుపై వాదనలు విననున్నారు. భారత ప్రభుత్వం తరుఫున 'బ్రిటన్‌ క్రౌన్‌ ప్రాసిక్యూషన్‌ సర్వీసెస్‌' తన వాదనలను వినిపించనుంది. అదేవిధంగా మాల్యా తరుఫున క్లేర్‌ మాంట్‌ గోమెరీ వాదించనున్నారు.

అంతర్జాతీయ క్రిమినల్‌ చట్టాలు, నేరస్తుల అప్పగింత వంటి కేసుల్లో క్లేర్‌కు ఏళ్ల అనుభవం ఉంది.ఈ కేసు వాదనలు ముగిసే సమయానికి అప్పగింతకు జడ్జి అంగీకరిస్తే, యూకే హోమ్‌ సెక్రటరీ అంబర్‌ రూడ్‌, మాల్యాను రెండు నెలల వ్యవధిలో భారత్‌కు అప్పగించాలని ఆదేశాలు జారీచేయనున్నారు. ఈ విచారణలో టాప్‌ సీబీఐ అధికారులు, స్పెషల్‌ డైరెక్టర్‌ ఆస్థానా పాల్గొననున్నారు. స్కాట్‌లాండ్‌ యార్డు పోలీసులు గతంలో ఆయనను లండన్‌లో అరెస్టు చేయగా, 650,000 పౌండ్ల పూచీకత్తుపై బెయిల్‌ పొంది బయటికి వచ్చారు. మాల్యా గత ఏడాది మార్చి నెలలో భారత్‌ నుంచి ఇంగ్లాండుకు పారిపోయిన సంగతి తెలిసిందే. యూకేకు పారిపోయిన మాల్యా అక్కడ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. 

మరిన్ని వార్తలు