ఏడు హెవీ బ్యాగులతో ఎగిరిపోయారు!

11 Mar, 2016 15:12 IST|Sakshi
ఏడు హెవీ బ్యాగులతో ఎగిరిపోయారు!

న్యూఢిల్లీ: బ్యాంకులకు రూ. 9 వేల కోట్లకు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత బుధవారం(మార్చి 2)న ఆయన విదేశాలకు పారిపోయినట్టు తెలుస్తోంది.

బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఢిల్లీ-లండన్ జెట్ ఎయిర్ వేస్ విమానం 9డబ్ల్యూ 122లో బ్రిటన్ కు వెళ్లిపోయినట్టు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఆయన వెంట ఒక మహిళ ఉన్నారని, ఫస్ట్ క్లాస్ లో ఆయన ప్రయాణించినట్టు తెలిపారు. మాల్యా భారీగా లగేజీ తీసుకెళ్లారని చెప్పారు. 'మాల్యా తనకు చెందిన ఏడు బ్యాగులను తనిఖీ చేయించుకున్నారు. మాల్యా, ఆయనతో పాటు విమానంలో ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించివారికి సహాయ సేవలు అందించడం జరిగింద'ని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

కాగా, ఉత్తర లండన్ లోని హెర్త్ ఫోర్ షైర్ లో ఉన్న తన నివాసంలో మాల్యాను స్థానికులు గుర్తించినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి పబ్ లకు వెళ్లే మాల్యా ఈసారి గడప దాటి బయటకు రాలేదని చెబుతున్నారు. ఆయనను భారత్ కు రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు