మాల్యాపై దేశీయ బ్యాంకుల విజయం

9 May, 2018 00:34 IST|Sakshi

ఆస్తుల స్వాధీనానికి యూకే హైకోర్టు లైన్‌ క్లియర్‌

లండన్‌: భారీ స్థాయిలో రుణాలు ఎగవేసి లండన్‌లో తలదాచుకుంటున్న ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాపై దేశీయ బ్యాంకులు విజయం సాధించాయి. మాల్యా నుంచి 1.55 బిలియన్‌ డాలర్ల బకాయిలు వసూలు చేసుకునేందుకు అనుమతి కోరుతూ 13 భారత బ్యాంకులు బ్రిటన్‌ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంలో మాల్యాకు చుక్కెదురు అయింది. మాల్యా ఆస్తులను ఫ్రీజ్‌ చేస్తూ భారత కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎత్తివేసేందుకు జడ్జి ఆండ్య్రూ హెన్షా నిరాకరించారు.

అదే సమయంలో మాల్యా నుంచి 1.55 బిలియన్‌ డాలర్ల బకాయిలను వసూలు చేసుకునేందుకు 13 బ్యాంకుల కన్సార్షియానికి అనుకూలంగా భారత కోర్టు ఇచ్చిన ఆదేశాలను జడ్జి సమర్థించారు. దీంతో ఇంగ్లండ్, వేల్స్‌లో మాల్యాకు ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు భారత బ్యాంకులకు వీలు చిక్కినట్టయింది. కర్ణాటకకు చెందిన డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌ బ్యాంకులకు మాల్యా రూ.62,033,503,879ను వడ్డీ సహా చెల్లించాలని లోగడ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.  

>
మరిన్ని వార్తలు