కరోనా ప్యాకేజీ : మాల్యా స్పందన

14 May, 2020 09:26 IST|Sakshi

రుణాలు 100 శాతం చెల్లిస్తా, కేసు క్లోజ్ చేయండి!

మళ్లీ అదే పాట పాడుతున్న మాల్యా

సాక్షి, ముంబై : వేల కోట్ల రూపాయల రుణాలను ఎగవేసి లండన్ పారిపోయిన పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యాలాక్‌డౌన్‌ కరోనావైరస్ సంక్షోభంలో కేంద్రం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆర్థికప్యాకేజీ పై స్పందించారు. తన రుణాలను 100 శాతం చెల్లిస్తాను అని చెప్పేందుకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకునే మాల్యా ఈసారీ అదే చేశారు. కోవిడ్-19 ఉపశమన ప్యాకేజీపై ప్రభుత్వానికి  అభినందనలు తెలిపిన మాల్యా తన దైన శైలిలో ట్వీట్ చేశారు.

ఇక ప్రభుత్వం తాను కోరుకున్నంత కరెన్సీని ముద్రించుకోవచ్చు. కానీ తనలాంటి చిన్న చెల్లింపుదారుడు ప్రభుత్వ బ్యాంకుల రుణాలను పూర్తిగా చెల్లిస్తారని ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోక పోవడం న్యాయమా అని వాపోయారు.  వరుసగా తన అభ్యర్థనను తోసిపుచ్చుతున్నారని విమర్శించారు. దయచేసి ఆ నగదును తీసుకొని తన కేసును క్లోజ్ చేయాలని మాల్యా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. (వలస కార్మికుల కేటాయింపులపై చిదబరం వ్యాఖ్యలు)

కాగా ఎస్బీఐ నేతృతంలోని బ్యాంకుల సముదాయానికి వేలకోట్ల రుణాలు ఎగవేసిన విదేశాలకు చెక్కేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా మనీలాండరింగ్ ఆరోపణల కేసులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే మాల్యాపై  కేసులు నమోదు , ఆస్తుల స్వాధీనం లాంటి చర్యల్ని చేపట్టిన కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ, ఈడీ  చార్జిషీట్లను దాఖలు చేశాయి. అలాగే  మాల్యాను  ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుడిగా ప్రకటించిన కేంద్రం అతడిని స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ కేసులో లండన్ కోర్టులో విచారణను ఎదుర్కొంటున్న మాల్యా  తన రుణాలను మొత్తం చెల్లిస్తానని, తన అభ్యర్థనను మన్నించాలని పలుసార్లు వేడుకుంటున్న సంగతి తెలిసిందే.  (కరోనా ఎప్పటికీ పోదు : డబ్ల్యూహెచ్ఓ తాజా హెచ్చరిక)

మరిన్ని వార్తలు