విశాఖ స్టీల్‌ టర్నోవర్‌ రూ.16,500 కోట్లు

4 Apr, 2018 00:39 IST|Sakshi

ఉక్కునగరం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ 2017–18లో అత్యధికంగా రూ.16,500 కోట్ల టర్నోవర్‌ సాధించింది. ఉక్కు మల్టీపర్పస్‌ హాలులో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ పి. మధుసూదన్‌ ఈ  వివరాలను తెలియజేశారు. స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగుల కృషి ఫలితంగా  టర్నోవర్‌లో 31 శాతం వృద్ధి సాధించగా, సేలబుల్‌ స్టీల్‌ 17 శాతం వృద్ధితో 4.5 మిలియన్‌ టన్నులు ఉత్పత్తి  సాధించామన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో హాట్‌మెటల్‌ 17 శాతం, ద్రవపు ఉక్కు 19 శాతం, ఫినిష్డ్‌ స్టీల్‌ 21 శాతం, విలువ ఆధారిత ఉత్పత్తులు 16 శాతం, విద్యుత్‌ ఉత్పత్తిలో 28 శాతం వృద్ధి నమోదు చేశామని వివరించారు. ఇదే ఉత్సాహంతో పనిచేస్తే  2018–19లో టర్న్‌ అరౌండ్‌ సాధించడం ఖాయమన్నారు. 

2018–19లో హాట్‌ మెటల్‌ 6.4 మిలియన్‌ టన్నులు, ద్రవపు ఉక్కు 6.3 మి.ట, సేలబుల్‌ స్టీల్‌ 5.7 మి.ట లక్ష్య సాధనతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ముందుకు సాగుతోందని వెల్లడించారు. ఇందుకోసం ఉద్యోగులంతా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు.  కార్యక్రమంలో డైరెక్టర్లు రే చౌదరి, పి.కె. రథ్, కె.సి.దాస్, ఈడీలు, జీఎంలు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు