దేశీయ విమానయాన సంస్థ విస్తారా గుడ్ న్యూస్ చెప్పింది. వందమందికి పైగా పైలట్లను, 400 మందికి పైగా క్యాబిన్ ఉద్యోగాలను కల్పించనున్నట్టు ప్రకటించినట్టు సమాచారం.
ఈనియామకాల్లో ముఖ్యంగా రోడ్డున పడ్డ జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనుందట. తద్వారా అప్పుల సంక్షోభంలో చిక్కుకుని, కార్యకలాపాలను నిలిపివేసిన దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులకు భారీ ఊరటనివ్వనుంది. అలాగే విస్తారా నిబంధనలు, స్టాండర్డ్స్కు అనుగుణంగా వీరికి (జెట్ ఎయిర్వేస్కు చెందిన పైలట్లు, ఇంజనీర్లు, ఇతర సిబ్బందికి) సంబంధిత విక్షణను కూడా ఇవ్వనుందని ఇండస్ట్రీకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు.
అంతేకాదు జెట్ ఎయిర్వేస్కు చెందిన 737 బోయింగ్ విమానాలను కూడా విస్తారా తన ఖాతాలో చేర్చుకోనుంది. త్వరలోనే అంతర్జాతీయ సర్వీసులను కూడా ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ నియమకాలని తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై విస్తారా అధికారికంగా స్పందించాల్సి ఉంది.