వైజాగ్‌ ఎయిర్‌పోర్ట్‌ మూసివేయం: ఏఏఐ

28 Feb, 2019 00:16 IST|Sakshi

హైదరాబాద్‌: విశాఖపట్నం విమానాశ్రయాన్ని మూసివేసే ఉద్ధేశం లేదని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) స్పష్టం చేసింది. కొత్తగా నిర్మించనున్న భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విశాఖ ఎయిర్‌పోర్టును మూసివేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భావిస్తోంది. ‘వైజాగ్‌ ఎయిర్‌పోర్టు కొనసాగుతుంది. ఈ విషయాన్ని మా మంత్రి పార్లమెంటులో స్పష్టం చేశారు కూడా. మూసివేత విషయమై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వచ్చింది. దీనికి మేం స్పందించలేదు.

దీనికి కారణం ఈ ప్రతిపాదనను మేం పరిగణలోకి తీసుకోవడం లేదు’ అని ఏఏఐ ఫైనాన్స్‌ సభ్యులు ఎస్‌.సురేశ్‌ వ్యాఖ్యానించారు. ఏఏఐతో తాము చర్చిస్తున్నట్టు ఏపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌ జైన్‌ తెలిపారు. వైజాగ్‌ ఎయిర్‌పోర్టులో చేసిన పెట్టుబడిని భర్తీ చేయాలని ఏఏఐ కోరిందని చెప్పారు. ఈ విషయాన్ని తేల్చాల్సిందిగా ఏఏఐ చెబుతోందన్నారు. ఎంత పెట్టుబడి పెట్టారో తెలపాలని, ఆ మొత్తాన్ని తాము చెల్లిస్తామంటూ లేఖ రాశామని ఆయన వివరించారు. ప్రస్తుతమున్న విమానాశ్రయం వైజాగ్‌ సిటీకి సమీపంలో ఉంది. వైజాగ్‌ సిటీ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది.  

మరిన్ని వార్తలు