ఆస్తుల విక్రయ ప్రయత్నాల్లో ఐడియా!

12 Dec, 2019 02:22 IST|Sakshi

ఏజీఆర్‌ బకాయిలు చెల్లించే యత్నం

ఆప్టిక్‌ ఫైబర్‌ వ్యాపార విక్రయానికి బ్రూక్‌ఫీల్డ్‌తో చర్చలు 

డేటా సెంటర్‌ అమ్మకానికి ఎడెల్‌వీజ్‌తో సంప్రదింపులు

ముంబై: భారీ రుణభారంతో కుదేలైన వొడాఫోన్‌ ఐడియా కంపెనీ ఆస్తుల విక్రయానికి వివిధ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. ఆప్టిక్‌ ఫైబర్‌ వ్యాపారాన్ని విక్రయించడానికి బ్రూక్‌ఫీల్డ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌తోనూ, నవీ ముంబైలో ఉన్న డేటా సెంటర్‌ను అమ్మేయడానికి ఎడెల్‌వీజ్‌ గ్రూప్‌తోనూ ఐడియా చర్చలు జరుపుతోందని సమాచారం. సంబంధిత వర్గాల కథనం ప్రకారం... వొడాఫోన్‌ ఐడియా కంపెనీ తన 1,56,000 కిమీ. ఆప్టిక్‌ ఫైబర్‌ వ్యాపారాన్ని విక్రయించడానికి బ్రూక్‌ఫీల్డ్‌ సంస్థతో పాటు ఇతర సంస్థలతో కూడా చర్చలు జరుపుతోంది. ఈ వ్యాపారం విలువ 150–200 కోట్ల డాలర్ల మేర ఉండొచ్చని అంచనా.

ఇక నవీ ముంబైలోని డేటా సెంటర్‌ను ఎడెల్‌వీజ్‌ సంస్థకు చెందిన ఎడెల్‌వీజ్‌ ఈల్డ్‌ ప్లస్‌ ఫండ్‌ కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఈ డేటా సెంటర్‌ విలువ 6–10 కోట్ల డాలర్ల మేర ఉండొచ్చు. సవరించిన స్థూల రాబడి(ఏజీఆర్‌)కు సంబంధించి వొడాఫోన్‌ ఐడియా రూ.53,000 కోట్ల బకాయిలను మూడు నెలల్లోగా చెల్లించాలని సుప్రీం కోర్ట్‌ ఈ ఏడాది అక్టోబర్‌24న తీర్పునిచి్చంది. ఈ ఆస్తుల విక్రయం ద్వారా ఈ బకాయిలను కొంతైనా తీర్చాలని ఈ కంపెనీ యోచిస్తోంది. అయితే టెలికం రంగానికి రూ.7 లక్షల కోట్లకు పైగా బకాయిలు ఉండటంతో ఆప్టిక్‌ ఫైబర్‌ ఆస్తుల విక్రయానికి బ్యాంక్‌లు అభ్యతరం చెప్పే అవకాశాలున్నాయి.

మరిన్ని వార్తలు