ఐడియా నష్టాలు రూ.73,878 కోట్లు

2 Jul, 2020 13:03 IST|Sakshi

న్యూఢిల్లీ: టెలికం కంపెనీ వొడాఫోన్‌ ఐడియాకు గత ఆర్థిక సంవత్సరం(2019–20)లో రూ.73,878 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ స్థాయి నష్టాలు ఇప్పటివరకూ ఏ భారత కంపెనీకి రాలేదు. ఏజీఆర్‌ (సవరించిన స్థూల రాబడి) సంబంధిత బకాయిలకు కేటాయింపులు కారణంగా ఈ కంపెనీకి ఈ స్థాయి నష్టాలు వచ్చాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19)లో నికర నష్టాలు రూ.14,604 కోట్లుగా ఉన్నాయి.  ఆదాయం రూ.37,093 కోట్ల నుంచి రూ.44,958 కోట్లకు పెరిగింది. (హైవే ప్రాజెక్టుల్లోకి చైనాకు నో వే!)

∙గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో ఈ కంపెనీ నష్టాలు మరింతగా పెరిగాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2018–19) క్యూ4లో రూ.4,882 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత క్యూ4లో రూ.11,644 కోట్లకు ఎగిశాయి. గత క్యూ3లో నష్టాలు రూ.6,439 కోట్లుగా ఉన్నాయి.  

∙గత క్యూ4లో ఆదాయం రూ.11,754 కోట్లు. సీక్వెన్షియల్‌గా కార్యకలాపాల ఆదాయం 6 శాతం వృద్ధి చెందింది. గత ఏడాది డిసెంబర్‌ నుంచి టారిఫ్‌లు పెంచడం వల్ల ఆదాయం పెరిగింది.  
∙గత క్యూ3లో రూ.109గా ఉన్న ఒక్కో వినియోగదారుడి నుంచి లభించే సగటు రాబడి(ఏఆర్‌పీయూ) గత క్యూ4లో రూ.121కు పెరిగింది. ఇదే కాలంలో వినియోగదారుల సంఖ్య 30.4 కోట్ల నుంచి 29.1 కోట్లకు తగ్గింది.  
∙ఐడియా సెల్యులర్‌లో వొడాఫోన్‌ ఇండియా 2018, ఆగస్టులో విలీనమైంది. అందుకని అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఫలితాలతో గత ఆర్థిక సంవత్సరం ఫలితాలను పోల్చడానికి లేదు.  
∙కంపెనీ రూ.51,400 కోట్ల మేర ఏజీఆర్‌ బకాయిలు చెల్లించాలి. మొత్తం రూ.58,254 కోట్ల బకాయిల్లో రూ.6,854 కోట్లు చెల్లింపులు జరిపింది.

మరిన్ని వార్తలు