వోడాఫోన్‌ ఐడియాను వీడని ఏజీఆర్‌ కష్టాలు

21 Jul, 2020 11:36 IST|Sakshi

9శాతం నష్టాన్ని చవిచూసిన షేరు

స్టాక్‌ మార్కెట్లో మంగళవారం ఉదయం సెషన్‌లో టెలికాం రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. టెలికాం సంస్థలు కేంద్రానికి చెల్లించాల్సిన ఏజీఆర్‌ బాకీల చెల్లింపునకు వ్యవధినిచ్చే అంశంపై సుప్రీంకోర్టు తన తీర్పును వాయిదా వేయడంతో ఈ రంగషేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. వోడోఫోన్‌ ఇండియా షేరు 9శాతం నష్టాన్ని చవిచూడగా, భారతీ ఎయిర్‌టెల్‌ షేరు 1.50శాతం పతనమైంది. 

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికాం(డాట్‌) ఏజీఆర్‌ లెక్కల ప్రకారం టెలికాం సంస్థలు స్పెక్ట్రం యూసేజీ చార్జీలు, లైసెన్సు ఫీజు బకాయిల కింద దాదాపు రూ. 1.6 లక్షల కోట్లు చెల్లించాల్సింది. ఏజీఆర్‌ బకాయిలు చెల్లింపునకు టెలికాం సంస్థలు కోరిన 20 ఏళ్ల దాకా గడువు అంశంపై కోర్టు ఇరువాదనలు విన్నది. అనంతరం ఏజీఆర్‌ బాకీల చెల్లింపునకు వ్యవధినిచ్చే అంశంపై తదుపరి విచారణను ఆగస్టు 10కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఇక బాకీల పునఃమదింపు అంశాన్ని టెల్కోలు ప్రస్తావించగా.. ఈ విషయంలో మరోమాట కూడా వినేదిలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

వోడాఫోన్‌ షేరు రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌:
ప్రముఖ రేటింగ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ వోడాఫోన్‌ రేటింగ్‌ను తగ్గించింది. గతంలో కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను ‘‘ అండర్‌ఫెమ్‌ఫామ్‌’’కి డౌన్‌గ్రేడ్‌ చేసింది. అలాగే షేరు టార్గెట్‌ ధర రూ.14 నుంచి రూ.9కి తగ్గించింది. ఆర్థికసంవత్సరం 2021, 2022లో సాధించే ఈబిటా కంటే కంపెనీ ఏజీఆర్‌ చెల్లింపులు 5శాతం నుంచి 30శాతం పెరుగుతాయని బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేస్తుంది. ఏజీఆర్‌ చెల్లింపుల గడువు వాయిదా తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్‌లో పెట్టడంతో వోడాఫోన్‌ ఐడియా 9శాతం నష్టాన్ని చవిచూసింది. ఉదయం గం.11:30ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.9.04)తో పోలిస్తే 7.50శాతం లాభంతో రూ.8.38  వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడిచిన 3నెలల్లో 117శాతం లాభపడింది.

మరిన్ని వార్తలు