రాష్ట్రంలో వొడాఫోన్ ఎం-పెసా సేవలు షురూ

24 Apr, 2014 01:03 IST|Sakshi
రాష్ట్రంలో వొడాఫోన్ ఎం-పెసా సేవలు షురూ

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ వొడాఫోన్ ఆంధ్రప్రదేశ్‌లో మొబైల్ మనీ సేవలు ‘ఎం-పెసా’ ప్రారంభించింది. వొడాఫోన్ కస్టమర్లు తమ మొబైల్ ఫోన్ ద్వారా మరే ఇతర టెలికం ఆపరేటర్లకు చెందిన మొబైల్ ఫోన్‌కుగానీ, బ్యాంకు ఖాతాకుగానీ దేశంలో ఎక్కడున్నా నగదు పంపవచ్చు. ఈ మొత్తాన్ని స్వీకరించినవారు సమీపంలోని వొడాఫోన్ ఎం-పెసా కేంద్రానికి వెళ్లి నగదు స్వీకరించవచ్చు. బిల్లుల చెల్లింపులు, మొబైల్, డీటీహెచ్ రిచార్జ్ చేసుకోవచ్చు. ఎంపిక చేసిన దుకాణాల్లో మొబైల్ ద్వారా చెల్లించవచ్చు. ఇ-కామర్స్ సైట్లలో వస్తువులను కొనుక్కోవచ్చు. డిపాజిట్‌పై 4 శాతం వడ్డీ కూడా పొందవచ్చు.

 బతుకుదెరువు కోసం కుటుంబానికి దూరంగా ఉంటున్నవారికి ఇది ఎంతో ఉపయుక్తమని ఎం-పెసా బిజినెస్ హెడ్ సురేశ్ సేథి బుధవారమిక్కడ తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంకుతో కలిసి కంపెనీ ఈ సేవలను అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 3,826 ఎం-పెసా ఔట్‌లెట్లు ఉన్నాయని ఏపీ సర్కిల్ బిజినెస్ హెడ్ మన్‌దీప్ సింగ్ భాటియా పేర్కొన్నారు.

 ఇలా పనిచేస్తుంది..: వొడాఫోన్ కస్టమర్ తన ఫోన్ నుంచి గానీ, సమీపంలోని ఎం-పెసా ఔట్‌లెట్‌కు వెళ్లి పేరు నమోదు చేసుకోవాలి. కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే ఫోన్ నంబరు ఆధారంగా ఒక ఖాతా(వాలెట్) తెరుస్తారు. పేరు నమోదుకు రూ. 200, యాక్టివేషన్‌కు రూ.100 రుసుం చెల్లించాలి.  వాలెట్‌లో రూ.50 వేల వరకు డబ్బు జమ చేసుకోవచ్చు. నగదు స్వీకరించేవారికి ఎం-పెసా వాలెట్ ఉం డక్కరలేదు. రోజుకు రూ.5 వేలు, నెలకు రూ.25 వేల వరకే పంపొచ్చు. లావాదేవీనిబట్టి రూ.1-180 దాకా చార్జీ చేస్తారు. ఏపీలో అడుగు పెట్టడంతో ఎం-పెసా సేవలు దేశవ్యాప్తంగా విస్తరిం చినట్లయిందని వొడాఫోన్ ఇండియా సీవోవో సునిల్ సూధ్ తెలిపారు.

మరిన్ని వార్తలు