ఫ్లిప్‌ కార్ట్‌ను వాల్‌మార్ట్‌ కొంటే ప్రభుత్వానికీ పండగే!

9 May, 2018 00:53 IST|Sakshi

చేతికి 20% క్యాపిటల్‌ గెయిన్స్‌ పన్ను

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన వాల్‌మార్ట్‌ దేశీయ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేసేందుకు సంప్రదింపులు జరుపుతున్న నేపథ్యంలో ఈ డీల్‌ సాకారం అయితే, కేంద్ర ప్రభుత్వానికి క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ రూపేణా భారీ ఆదాయం సమకూరనుంది. డీల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ వ్యవస్థాపకులు సచిన్‌బన్సల్, బిన్నీబన్సల్‌ తమ వాటాలను వాల్‌మార్ట్‌కు విక్రయించినట్టయితే 20 శాతం మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుందని పన్ను నిపుణులు చెబుతున్నారు.

ఫ్లిప్‌కార్ట్‌–వాల్‌మార్ట్‌ డీల్‌పై ఈ వారంలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. 12 బిలియన్‌ డాలర్లతో 60 శాతానికిపైగా వాటాను వాల్‌మార్ట్‌ కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌పై డీల్‌ కుదిరితే రెండు రకాల పన్ను కోణాలుంటాయనేది నిపుణుల మాట. ఫ్లిప్‌కార్ట్‌లో వాటాదారులు పెట్టుబడులపై ఆర్జించిన లాభంపై పన్ను చెల్లించడం ఒకటి. రెండోది ఫ్లిప్‌కార్ట్‌ ఇండియా తన నష్టాలను ఆదాయపన్నుతో సర్దుబాటు చేయడం రెండోది.

ఫ్లిప్‌కార్ట్‌లో వాటాలున్న ఇన్వెస్టర్ల మాతృ దేశంతో మనదేశానికి ఉన్న పన్ను ఒప్పందాలకు లోబడి ఇది ఉంటుందని నాంజియా అండ్‌కో డైరెక్టర్‌ చిరాగ్‌ నాంజియా పేర్కొన్నారు. ఫ్లిప్‌కార్ట్‌ ప్రమోటర్లు తమ వాటాలను విక్రయించినట్టయితే వారు ఇక్కడి వారే కనుక ఆర్జించిన మూలధన లాభంపై పన్ను చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.

భారత్‌లో రూ.2,600 కోట్ల అమెజాన్‌ పెట్టుబడులు  
అమెరికా దిగ్గజం అమెజాన్‌.. భారత్‌లోని తన విభాగం కోసం తాజాగా రూ.2,600 కోట్లు పెట్టుబడులు పెడుతోంది. ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్‌ల మధ్య ఒప్పందం దాదాపు ఖరారైన నేపథ్యంలో ఈ పెట్టుబడులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

>
మరిన్ని వార్తలు