భారత కంపెనీలో వాటాపై వారెన్ బ‌ఫెట్ ఆస‌క్తి

27 Aug, 2018 20:08 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే దిగ్గజ ఇన్వెస్టర్‌గా ప్రఖ్యాతి గాంచిన, బార్క్‌షైర్ హతావే చైర్మన్ వారెన్ బఫెట్ భారత డిజిటల్ పేమెంట్ దిగ్గజం పేటీఎమ్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. పేటీఎమ్‌ మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌లో బఫెట్ రూ 2200 - 2,500 కోట్ల మేర పెట్టుబడి పెట్టనున్నట్టు సమాచారం. ఒకవేళ ఈ ఒప్పందం కుదిరితే భారత్‌కు చెందిన ఓ కంపెనీలో బఫెట్‌ పెడుతున్న తొలి ప్రత్యక్ష పెట్టుబడి ఇదే అవుతుంది. ఫ్లిప్‌కార్ట్ నేతృత్వంలోని ఫోన్‌పే, గూగుల్ యాప్ తేజ్ తదితర సంస్థలకు పేటీఎమ్‌ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మరో రెండు వారాల్లో ఈ డీల్‌పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. డిజిట‌ల్ చెల్లింపులు పుంజుకున్న త‌రుణంలో పేటీఎమ్ విలువ అంత‌కంత‌కూ పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఆపిల్ కంపెనీలో వారెన్ బఫెట్‌కి చెందిన బార్క్‌షైర్ హాత్వేకి 5 శాతం వాటా ఉన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు