హాట్‌కేకుల్లా వేరబుల్స్‌

5 Sep, 2019 13:08 IST|Sakshi

30 లక్షల మార్కును దాటిన సేల్స్‌

మూడో స్థానంలో నిలిచిన భారత్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వేరబుల్‌ డివైజెస్‌ స్మార్ట్‌ఫోన్లతో పోటీపడుతున్నట్టుగా ఉంది. భారత్‌లో వీటి విక్రయాలు కనీవినీ ఎరుగని రీతిలో ఆల్‌ టైం హైకి చేరుకున్నాయి. ఏప్రిల్‌–జూన్‌ కాలంలో ఏకంగా 30 లక్షల యూనిట్లకుపైగా అమ్మకాలు నమోదయ్యాయంటే వీటికి ఉన్న క్రేజ్‌ అర్థం చేసుకోవచ్చు. వృద్ధి క్రితం త్రైమాసికంతో పోలిస్తే 30.9 శాతం నమోదైంది. అంతర్జాతీయంగా మొత్తం విక్రయాల పరంగా చూస్తే భారత్‌ మూడో స్థానాన్ని పదిలపరుచుకుంది. వేరబుల్‌ డివైజెస్‌ వినియోగంలో తొలి రెండు స్థానాల్లో చైనా, యూఎస్‌ మార్కెట్లు నిలిచాయి. ఫిట్‌నెస్‌ బ్యాండ్స్, స్మార్ట్‌వాచ్‌లు, హియరేబుల్స్‌ వంటి వేరబుల్‌ డివైజెస్‌ను విభిన్న ఫీచర్లు, ధరల శ్రేణితో కంపెనీలు పోటీపడుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు సైతం వేరబుల్‌ డివైజెస్‌ను తయారు చేస్తున్నాయి. 

హియరేబుల్స్‌కు ఆదరణ..
ఐడీసీ గణాంకాల ప్రకారం 2019 జనవరి–మార్చిలో భారత్‌లో 23.1 లక్షల యూనిట్ల వేరబుల్‌ డివైజెస్‌ కస్టమర్ల చేతుల్లోకి చేరాయి. అదే 2018 ఏప్రిల్‌–జూన్‌ కాలంతో పోలిస్తే క్రితం త్రైమాసికం వృద్ధి ఏకంగా 123.6 శాతం నమోదైంది. ఈ అంకెలనుబట్టి చూస్తుంటే వేరబుల్‌ డివైజెస్‌కు పెరుగుతున్న డిమాండ్‌ ఏ స్థాయిలో ఉందో అవగతమవుతోంది. మరో విశేషమేమంటే ఏప్రిల్‌–జూన్‌లో రిస్ట్‌ బ్యాండ్స్‌ను మించి హియరేబుల్స్‌ సేల్స్‌ నమోదయ్యాయి. ఈ విభాగం అంత క్రితం తైమాసికంతో పోలిస్తే 122.7 శాతం, క్రితం ఏడాది ఏప్రిల్‌–జూన్‌తో పోలిస్తే 374.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. హెల్త్, ఫిట్‌నెస్‌ను ట్రాక్‌ చేసే వైర్‌లెస్‌ ఇయర్‌ వేర్‌ మోడళ్లకు డిమాండ్‌ పెరుగుతోంది. ఇయర్‌ వేర్‌ విభాగం 55.9 శాతం, రిస్ట్‌ బ్యాండ్స్‌ 35.2, స్మార్ట్‌ వాచెస్‌ 6.9 శాతం వాటాను కైవసం చేసుకున్నాయి.

మరిన్ని వార్తలు