2021లో 25% సంపద విరాళం
ముంబై: ఇండియన్ వారెన్ బఫెట్గా సుపరిచితుడు, ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టరు రాకేశ్ ఝన్ఝన్వాలా దాతృత్వం వైపు తొలి అడుగు వేశారు. 2021 జూలై 5 నాటికి తన పెట్టుబడుల పోర్ట్ ఫోలియో విలువలో 25% లేదా రూ.5 వేల కోట్లు... ఈ రెండింటిలో వేటి విలువ తక్కువ అయితే ఆ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు విరాళంగా అందిస్తానని ఝన్ఝన్వాలా ప్రకటించారు. ‘సేవా కార్యక్రమాలకు ఎంత ఇచ్చావు? అని ఏటా నన్ను మా నాన్న అడిగేవారు.
నీ నుంచి ఏమీ ఆశించనని, సేవా కార్యక్రమాలకు ఇవ్వాలని కోరేవారు. 2008లో ఆయన మరణించారు. దాతృత్వమే నాన్నకు ఇచ్చే ఘన నివాళి అని ఆ తర్వాత అనుకున్నా. అప్పటి నుంచి డివిడెండ్ ఆదాయంలో 25% సేవా కార్యక్రమాలకు ఇస్తున్నాను’ అని ఝన్ఝన్వాలా చెప్పారు. విప్రో చైర్మన్ ప్రేమ్జీ తన సంపదలో 80% విరాళంగా ప్రకటించడం తెలిసిందే.