ఆన్‌లైన్‌ మోసాలపై కస్టమర్లకు భారీ ఊరట

7 Jul, 2017 15:47 IST|Sakshi
ఆన్‌లైన్‌ మోసాలపై కస్టమర్లకు భారీ ఊరట

ముంబై:  ఆన్‌లైన్‌  అక్రమ లావాదేవీలపై కస్టమర్ల ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా   స్పందించింది.  ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ లో అక్రమాల బారిన పడి నగదు నష్టపోతున్న ఖాతాదారులకు భారీ ఊరట నిచ్చేలా కొత్త మార్గదర్శకాలను జారీ  చేసింది.  ఖాతాదారుల  ప్ర‌మేయం లేకుండా   చోటు చేసుకునే   అనుమానాస్పద లావాదేవీల‌కు సంబంధించి జాగ్రత్తలు,  ఇతర భద్రతా అంశాలపై   సూచనలతో కూడిన ఒక నోటిఫికేషన్‌ను ఆర్‌బీఐ విడుదల చేసింది. ఖాతాలు, కార్డుల నుంచి అన‌ధికారిక లావాదేవీల ద్వారా డ‌బ్బు కోల్పోతున్నామ‌ని ఫిర్యాదులు పెరిగిన నేప‌థ్యంలో అలాంటి ప‌రిస్థితుల్లో ఏ విధంగా చేయాల‌నే దానిపై ఆర్‌బీఐ బ్యాంకుల‌కు, ఖాతాదారుల‌కు సూచ‌న‌లు ఇచ్చింది.  ఖాతాదారుల హ‌క్కులు, అభ్యంత‌రాల‌ను ఎలా ప‌రిష్క‌రిస్తారో తెల‌పాల్సిందిగా బ్యాంకుల‌ను ఆర్‌బీఐ ఆదేశించింది.  కేంద్రం డిజిటల్‌  లావాదేవీలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ఎల‌క్ట్రానిక్ లావాదేవీల భ్రదత, నష్టనివారణపై హామీ,నిబంధనలపై వివరణ యిస్తూ  ఆర్‌బీఐ ఈ సూచనలు అందించింది.

క‌స్ట‌మ‌ర్లు ఎల‌క్ట్రానిక్ లావాదేవీల్లో త‌మ ప్ర‌మేయం లేకుండా జ‌రిగే లావాదేవీల‌కు సంబంధించి మూడు రోజుల్లో బ్యాంకు లేదా ఆర్‌బీఐకి తెలియ‌జేస్తే, దానికి సంబంధించిన సొమ్మును 10 రోజుల్లోపు  ఆయా ఖాతాదారులకు వెనక్కి   చెల్లించే అవకాశం ఉంది. మూడు ప‌నిదినాలు క‌స్ట‌మ‌ర్ ప్ర‌మేయం లేకుండా జ‌రిగే థ‌ర్డ్ పార్టీ మోసాల‌కు బ్యాంకు ఖాతాదారు ఎలాంటి న‌ష్టాన్ని భ‌రించాల్సిన అవ‌స‌రం లేదు. లోపం బ్యాంకు వైపునుంచి లేదా  ఖాతాదారులవైపు నుంచి లేదని తేలితే  ఉంటే ఖాతాదారు డ‌బ్బు న‌ష్ట‌పోవాల్సిన ప‌ని లేదు. అయితే  డ‌బ్బు కోల్పోయిన‌ మూడు ప‌నిదినాల్లోగా దాన్ని బ్యాంకుకు తెలియజేయాల్సి ఉంటుంది.
ఒక వేళ మోసాన్ని నాలుగు నుంచి ఏడు ప‌నిదినాల్లోగా తెలియ‌జేసిన‌ట్ల‌యితే, బ్యాంకు ఖాతాదారు గ‌రిష్టంగా రూ.5000 నుంచి రూ.25 వేల వ‌ర‌కూ న‌ష్టాన్ని భ‌రించాల్సి రావ‌చ్చు. ఇది అకౌంట్‌, క్రెడిట్ కార్డు ప‌రిమితిని బ‌ట్టి ఆధార‌ప‌డి ఉంటుంది.  ఒక వేళ‌ మోస‌పూరిత లావాదేవీ గురించి  7 రోజుల త‌ర్వాత బ్యాంకుకు తెలియ‌జేసిన‌ట్ల‌యితే అప్పుడు ఖాతాదారు భ‌రించాల్సిన న‌ష్టం బ్యాంకు పాల‌సీ పైన ఆధార‌ప‌డి ఉంటుంది.
 
ఖాతాదారు నిర్ల‌క్ష్యంగా ఉంటే ఖాతాదారు నిర్ల‌క్ష్యం( పిన్‌, ఇన్‌టైంపాస్‌వర్డ్‌ తదితర వివ‌రాలు వెల్ల‌డించ‌డం ద్వారా) కార‌ణంగా మోసం జ‌రిగి ఉంటే మాత్రం ఈ నష్టాన్ని కస్టమరే భరించాల్సి ఉంటుంది.  బ్యాంకు భ‌రించ‌దు.  అయితే ఇక్కడ కస్టమర్లకు మరో సౌలభ్యాన్ని కూడా  కల్పించింది. ఒకసారి అనుమానాస్పద లేదా అన‌ధికారిక లావాదేవీ గురించి బ్యాంకుకు తెలియ‌జేసిన వెంట‌నే మ‌ళ్లీ ఏదైనా అనుమాన‌స్ప‌ద లావాదేవీ జ‌రిగితే ఆ న‌ష్టాన్ని బ్యాంకు భ‌రిస్తుంద‌ని ఆర్‌బీఐ  పేర్కొంది.  

ఎల‌క్ట్రానిక్ లావాదేవీలు ఎల‌క్ట్రానిక్ లావాదేవీలు అంటే ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్‌, మొబైల్ బ్యాంకింగ్‌, ఏటీఎమ్‌, పాయింట్ ఆఫ్ సేల్స్ మొద‌లైన అన్ని ర‌కాలుగా జ‌రిగే న‌గ‌దు సంబంధిత వ్య‌వ‌హారాలుగా ప‌రిగ‌ణిస్తారు.  క‌స్ట‌మ‌ర్‌కు సంబంధించి న‌ష్టం భ‌రించాల్సి రావ‌డం ఏదైనా మోస‌పూరిత లావాదేవీ జ‌రిగిన త‌ర్వాత బ్యాంకు ఖాతాదారు స‌ద‌రు బ్యాంకుకు నివేదిస్తే, ఆ అన‌ధికారిక లావాదేవీకి సంబంధించిన సొమ్మును బ్యాంకు 10 ప‌నిదినాల్లోగా ఖాతాదారు బ్యాంకు ఖాతాకు జ‌మ చేయాల్సి ఉంటుంది. ఎంత సొమ్ము వెన‌క్కు వ‌స్తుంద‌నే అంశం అన‌ధికారిక లావాదేవీ జ‌రిగిన రోజు ఎంత డ‌బ్బు మిన‌హాయించ‌బ‌డింద‌నే దానిపై ఆధార‌ప‌డి ఉంటుంది. నోటిఫికేషన్ తేదీ నుంచి ఫిర్యాదు చేసిన 10 పని రోజులలో అనధికార ఎలక్ట్రానిక్ లావాదేవీ  మొత్తాన్ని బ్యాంక్ క్రెడిట్ చేస్తుంది. అనధికార ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీల విషయంలో వినియోగదారు బాధ్యత రుజువు చేసే భారం బ్యాంకుపై ఉంటుందని ఆర్‌బీఐ తన నోటిషికేషన్‌ లో తెలిపింది.

అటువంటి లావాదేవీల సంభవించిన తరువాత అనధికార ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీల విషయాన్ని  బ్యాంకుకు తెలియజేయాలని వినియోగదారులకు సూచించింది.  అలాగే బ్యాంకులు  కూడా ఖాతాదారుల‌ను  నిరంతరం అప్ర‌మ‌త్తం చేయాలి. ఆన్‌లైన్ మోసాల నుంచి ఖాతాదారుల‌ను కాపాడేందుకు, బ్యాంకులు క‌స్ట‌మ‌ర్ల‌ను అల‌ర్ట్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా  ఎస్ఎంఎస్‌లు, ఈ-మెయిల్స్ ద్వారా అన‌ధికారిక‌, మోస‌పూరిత లావాదేవీల గురించి నిత్యం వినియోగ‌దారులకు సమాచారం అందించాలి.  అంతేకాదు  మోస‌పూరిత లావాదేవీలు జ‌రిగిన సంద‌ర్భంలో కస్టమర్‌ ఎవ‌రికి ఫిర్యాదు చేయాల‌నే అంశాన్ని స్పష్టంగా సూచించాలని కోరింది.   ఈ ఫిర్యాదు కోసం   బ్యాంకు  బహుళ ఛానల్స్ ద్వారా (కనీసం, వెబ్ సైట్, ఫోన్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్, ఇ-మెయిల్, ఐవీఆర్, ప్రత్యేకమైన టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్లు, హోమ్  బ్రాంచ్‌కు ) ద్వారా 24x7 వినియోగదారుకు అందుబాటులో ఉంచాలని ఆర్బిఐ బ్యాంకులను కోరింది.

మరిన్ని వార్తలు