ప్రమాదంలో వాట్సాప్‌ యూజర్ల గోప్యత

7 Jun, 2020 14:45 IST|Sakshi

సోషల్‌ మీడియా ఖాతాలపైనా కన్ను!

న్యూఢిల్లీ : వాట్సాప్ పలు ఆకర్షణీయ ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకున్నా ఇప్పుడు అవే ఫీచర్లలో ఉన్న బగ్‌ యూజర్ల గోప్యతను ప్రమాదంలో పడవేస్తోంది.  ఈ బగ్‌ గూగుల్ సెర్చ్ ఫలితాల్లో వాట్సాప్ యూజర్ ఫోన్ నంబర్ కనిపించేలా చేస్తోంది. వాట్సాప్ క్లిక్ టు చాట్ ఫీచర్‌లోని బగ్ సోషల్ మెసేజింగ్ సైట్ యొక్క వినియోగదారుల ఫోన్ నంబర్లను గూగుల్ సెర్చ్‌ ఇండెక్స్‌కు అనుమతించడంతో గోప్యతకు పెనుముప్పు ఎదురవుతోందని బగ్-బౌంటీ హంటర్ అతుల్ జయరామ్ వెల్లడించారు.

ఇది వెబ్‌లో వినియోగదారుల ఫోన్ నంబర్ల కోసం వెతికేందుకు ఎవరినైనా అనుమతించడంతో వాట్సాప్‌ యూజర్ల భద్రత ప్రమాదంలో పడుతుంది. దీంతో క్లిక్‌ టూ చాట్‌తో యూజర్‌ మరో వాట్సాప్‌ యూజర్‌తో వారి ఫోన్‌ నెంబర్లను సేవ్‌ చేసుకోకుండానే వాట్సాప్‌ చాట్‌ చేసేందుకు అనుమతిస్తుంది. ఇక వెబ్‌సైట్లు తమ విజిటర్లతో నేరుగా ఫోన్‌ నెంబర్లను సంప్రదించకుండానే వారితో సంప్రదింపులు జరిపే వెసులుబాటు లభిస్తుంది. ఈ వెసులుబాటుతో స్కామర్ల చేతికి వాట్సాప్‌ యూజర్ల ఫోన్‌ నెంబర్ల జాబితాలు చిక్కుతాయని బగ్‌-బౌంటీ హంటర్‌ జయరామ్‌ పేర్కొన్నారు.

చదవండి : వాట్సాప్‌లో పెళ్లి ఫోటోలు.. మనస్తాపంతో..

వ్యక్తిగత ఫోన్‌ నెంబర్లు లీకైతే ఎటాకర్లు వాటికి మెసేజ్‌ చేయడం, క్సాల్‌ చేయడంతో పాటు ఆయా ఫోన్‌ నెంబర్లను వారు మార్కెటర్లకు, స్పామర్లు, స్కామర్లకు విక్రయించే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఫోన్‌నెంబర్లతో ఎటాకర్లు యూజర్ల ప్రొఫైల్స్‌ను యాక్సెస్‌ చేసేందుకు ప్రయత్నిస్తారని చెప్పారు. వాట్సాప్‌ ప్రొఫైల్‌లో యూజర్‌ ఫోటోను చూసే ఎటాకర్లు వారి ఇతర సోషల్‌ మీడియా ఖాతాలను సెర్చి చేయడం ద్వారా ఆయా వ్యక్తులను టార్గెట్‌ చేస్తారని అన్నారు. కాగా మే 23న పరిశోధకుడు బగ్‌ బౌంటీ ప్రోగ్రామ్‌ ద్వారా ఫేస్‌బుక్‌ను సంప్రదించగా కంపెనీ డేటా అబ్యూజ్‌ ప్రోగ్రాం కింద వాట్సాప్‌ కవర్‌ కాదని కంపెనీ బదులిచ్చింది. ఇక వాట్సాప్‌ యూజర్లు అవాంఛిత మెసేజ్‌లను ఒ బటన్‌ ద్వారా బ్లాక్‌ చేయవచ్చని వాట్సాప్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు