వాట్సాప్ కొత్త అప్ డేట్

17 Apr, 2020 15:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సొంతమైన వాట్సాప్ కొత్త అప్ డేట్ లను తీసుకురానుంది. ఎప్పటికపుడు కొత్త ఫీచర్లతో ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్లకు పైగా వినియోగదారులను సొంతం చేసుకున్న వాట్సాప్ కరోనా, లాక్‌డౌన్‌ సంక్షోభ సమయంలో మరో ఆసక్తికరమైన ఫీచర్ ను జోడించనుంది. వా బేటా ఇన్ఫో అందించి సమాచారం ప్రకారం వీడియో, ఆడియో కాలింగ్ లో పాల్గొనే  యూజర్ల పరిమితిని పెంచడానికి  వాట్సాప్ సన్నాహాలు చేస్తోంది.  గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్‌ కు ఆదరణ భారీగా పెరిగిన నేపథ్యంలో  ఎక్కువ మంది యూజర్లను ఆకర్షించేలా  ప్రయత్నాలు ముమ్మరం చేసింది. డార్క్ మోడ్, ఫింగర్ ప్రింట్ అన్‌లాక్‌లాంటి ఫీచర్లను అందించిన వాట్సాప్ తాజాగా గ్రూప్ వీడియో, ఆడియో కాలింగ్  పరిమితిని పెంచేందుకు యోచిస్తోంది. తద్వారా టెక్ దిగ్గజం గూగుల్ వీడియో కాలింగ్ యాప్ డియో, చైనాకు చెందిన జూమ్ లాంటి యాప్స్ దూకుడుకు కళ్లెం వేయాలని భావిస్తోంది. (జూమ్ యాప్ వాడొద్దు: హోం మంత్రిత్వ శాఖ)

కరోనా వైరస్ వ్యాప్తిని ఆపడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు భౌతిక దూరాన్ని పాటిస్తున్న సమయంలో వీడియో కాలింగ్ సదుపాయానికి డిమాండ్ బాగా పెరిగింది. గ్రూపు ఆడియో, వీడియో కాలింగ్ వైపు మళ్లిన తరుణంలో వాట్సాప్ ఈ కీలక మార్పును తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. లాక్ డౌన్ కాలంలో జూమ్, గూగుల్ డియో యాప్స్ లో ఒకేసారి డజన్ల కొద్దీ వ్యక్తులతో వీడియో కాలింగ్‌ను అనుమతి లభిస్తోంది. దీంతో వాట్సాప్  తాజా అప్ డేట్ తీసుకురానుంది. ప్రస్తుతానికి గ్రూప్ ఆడియో, వీడియో కాలింగ్ లో పాల్గొనడానికి నలుగురి మాత్రమే అనుమతి వుంది. ఇపుడు ఎంతమందికి అవకాశం కల్పిస్తుంది, ఎప్పటినుంచి యూజర్లకు ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది అనేదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. దీంతోపాటు ఆండ్రాయిడ్ వీ2.20.129 కోసం వాట్సాప్ బీటాలో ఇప్పటికే అందుబాటులో ఉన్ కొత్త కాల్ హెడర్‌ను జోడించడానికి కూడా వాట్సాప్ పనిచేస్తోంది. తద్వారా వాట్సాప్ కాల్స్ ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్టెడ్ అని చెప్పాలని లక్ష్యంగా పెట్టుకుంది. (జియో ఫైబర్:  రూ.199కే 1000 జీబీ డేటా)

కోవిడ్-19 మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌ అయిన ప్రజలు సోషల్ మీడియాకు అంకితమవుతున్నారు. కరోనా వైరస్ విస్తరణను అడ్డుకునే క్రమంలో, రవాణ వ్యవస్థ పూర్తిగా స్థంభించడతో అటు  ఉద్యోగులు కూడా ఇంటినుంచే తమ సేవలను అందిస్తున్నారు. దీంతో వివిధ సంస్థలు తమ ఉద్యోగులతో కనెక్ట్ అయ్యేందుకు, ఆన్ లైన్ తరగతులకు గ్రూపు వీడియో, లేదా వీడియో కాన్ఫరెన్సుల వైపు, మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. (కరోనా సంక్షోభం : టీసీఎస్ కీలక నిర్ణయం)

మరిన్ని వార్తలు