ఫేక్‌ న్యూస్‌ వార్‌ : వాట్సాప్‌ కొత్త ప్రచారం

3 Dec, 2018 13:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ్‌ మెసేజింగ్‌ ఆప్‌ వాట్సాప్‌ మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఫేక్‌న్యూస్‌ సవాలును ఎదుర్కొంనేందుకు  మొట్టమొదటిసారిగా టీవీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. తన ప్లాట్‌ఫాంపై నకిలీ వార్తలను అరికట్టేందుకు ఇప్పటికే పలుమార్గాల్లోక్యాంపెయిన్‌ మొదలు పెట్టిన వాట్సాప్‌ తాజాగా టీవీ ప్రకటనలను విడుదల చేసింది.  అసత్య వార్తలు, నకిలీ వార్తలు, హానికరమైన పుకార్ల దుమారం నేపథ్యంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా టీవీ ప్రచారం ప్రారంభించింది. ముఖ్యంగా తప్పుడు సమాచారం ఎలాంటి దారుణాలకు దారితీస్తాయో వివరిస్తూ 60 సెకన్ల మూడు యాడ్స్ రూపొందించి టీవీలో ప్రసారం చేస్తోంది.

చిత్రనిర్మాత షిర్షా గుహా థాకుర్తా నిర్వహణలో 60 సెకన్ల నిడివిగల మూడు ప్రకటనలను రూపొందించామని వాట్సాప్‌ ప్రతినిధి వెల్లడించారు. రాజస్థాన్‌, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందే వీటిని రూపొందించింది. టీవీ, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లలో తెలుగుతోపాటు ఇంగ్లీషు, హిందీ,  బెంగాలీ, అసోం, గుజరాతీ, మరాఠీ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని యాజమాన్యం తెలిపింది. దీంతోపాటు 2019 లోక్సభ ఎన్నికలకు సన్నద్ధ మవుతున్న తరుణంలో వీటిని  రూపొందించినట్టు పేర్కొంది.

కాగా ఫేక్ న్యూస్ వాట్సప్‌లో ఎక్కువగా వ్యాప్తి చెందుతుండటంలో వాట్సాప్‌పై ఒత్తిడి పెరిగింది. ఇటీవల కేంద్రం నోటీసులు కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫేక్‌న్యూస్‌  నిరోధంపై కసరత్తు చేస్తున్న వాట్సాప్‌ తాజా చర్యకు దిగింది. మొదటి దశలో భాగంగా ఆగస్ట్ 29 నుంచి బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్, రాజస్తాన్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో ఆల్ ఇండియా రేడియోకు చెందిన 46 రేడియో స్టేషన్ల ద్వారా యాడ్స్ ప్రసారం మొదలుపెట్టింది. ఆ తర్వాత సెప్టెంబర్ 5న భాగంగా అసోం, త్రిపుర, పశ్చిమబెంగాల్, గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా, తమిళనాడులోని  83 రేడియో స్టేషన్ల నుంచి రెండో దశ ప్రచారం ప్రారంభమైంది.

మరిన్ని వార్తలు