నియామకాల్లో మహిళలకు రెడ్‌ కార్పెట్‌

12 Dec, 2018 01:53 IST|Sakshi

2019లో 20 శాతం  పెరగనున్న హైరింగ్‌

పీపుల్‌స్ట్రాంగ్‌ నివేదికలో వెల్లడి

ముంబై:  వచ్చే ఏడాది మహిళా ఉద్యోగుల నియామకాలు గణనీయంగా పెరగనున్నాయి. 2019లో మహిళల హైరింగ్‌ 15–20 శాతం మేర పెరగనున్నట్లు కన్సల్టెన్సీ సంస్థ పీపుల్‌స్ట్రాంగ్‌ తెలియజేసింది. ముఖ్యంగా బ్యాంకింగ్‌ .. ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ .. ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ), ఆటోమోటివ్, ఐటీ, సాఫ్ట్‌వేర్, హాస్పిటాలిటీ.. ట్రావెల్‌ విభాగాల్లో ఈ నియామకాలు ఉండనున్నట్లు ’ది ఇండియన్‌ స్కిల్స్‌ రిపోర్ట్‌ 2019’ పేరిట రూపొందించిన నివేదికలో పీపుల్‌స్ట్రాంగ్‌ తెలియజేసింది. సుమారు 15 రంగాలకు చెందిన 1,000 పైగా సంస్థలు ఈ సర్వేలో పాల్గొన్నాయి.

నిర్దిష్ట హోదాలకు సంబంధించి సుశిక్షితులైన వారి సంఖ్య తక్కువగా ఉండటం, సామాజిక కట్టుబాట్లు, పని ప్రదేశాల్లో భద్రత తదితర అంశాలు సైతం మహిళల నియామకాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు పీపుల్‌స్ట్రాంగ్‌ వ్యవస్థాపకుడు దేవాశీష్‌ శర్మ చెప్పారు. మహిళల నియామకాలను ప్రోత్సహించేందుకు మరిన్ని చర్యలు అవసరమన్నారు. మహిళల ఉద్యోగిత క్రమంగా పెరుగుతోందంటూ ‘‘2017లో 38 శాతంగా ఉన్న ఉద్యోగిత.. 2018లో 46 శాతానికి చేరింది. కానీ ఇప్పటికీ మహిళా జనాభాతో పోలిస్తే వారి ప్రాతినిధ్యం చాలా తక్కువగానే ఉంటోంది’’ అని శర్మ వివరించారు. ఉద్యోగులు ఎక్కువగా ప్రాధాన్యమిచ్చే టాప్‌ 10 రాష్ట్రాల్లో తెలంగాణ ఆఖరున ఉంది. తెలంగాణతో పాటు రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌ ఈ లిస్టులో ఈ ఏడాది కొత్తగా చోటు దక్కించుకున్నాయి.    

మరిన్ని వార్తలు