శాంసంగ్‌కు షాకిచ్చిన షావోమి

25 Jan, 2018 10:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్‌ మేకర్‌ షావోమి భారత్‌లో తన  హవాను   చాటుకుంది. భారతీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో అప్రతిహతంగా దూసుకుపోతూ కొరియా మొబైల్‌ దిగ్గజం శాంసంగ్‌కు కోలుకోలేని షాక్‌ ఇచ్చింది.  17శాతం  వార్షిక వృద్ధితో   27శాతం మార్కెట్‌ వాటాను కొల్లగొట్టి శాంసంగ్‌ను  వెనక్కి నెట్టేసింది.  నాలుగు సంవత్సరాల వ్యవధిలోనే తన సత్తా చాటిన షావోమి  ర్యాంకింగ్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.  టాప్‌ ఎండ్‌ డివైస్‌ల ధరలు కొంచెం అధికంగా ఉన్నప్పటికీ,  మిడ్‌ రేంజ్‌, బడ్జెట్‌ సెగ్మెంట్‌లో ఆకర్షణీయమైన డివైస్‌లతో  భారతీయ వినియోగదారులను మెప్పించింది.  ముఖ‍్యంగా రెడ్‌ మి  సిరీస్‌ స్మార్ట్‌ఫోన‍్లతో  స్టార్‌ ప్లేయర్‌గా నిలిచింది. మూడవ త్రైమాసికంలో శాంసంగ్‌, షావోమి  రెండూ 23.5 శాతం మార్కెట్‌ వాటాతో టాప్‌ ర్యాంక్‌కు  నువ్వానేనా అన్నట్టు పోటీపడినా, క్యూ4లో మాత్రం షావోమి శాంసంగ్‌ను అధిగమించింది.

పరిశోధనా సంస్థ కానల్స్ నివేదిక ప్రకారం, 2017 నాలుగో త్రైమాసికంలో శాంసంగ్‌ ను షావోమి ఓడించింది. 2017 క్యూ4లో  8.2 మిలియన్ యూనిట్లు (27 శాతం మార్కెట్ వాటా) చేరువలో ఉంది. వార్షిక వృద్ధి 17 శాతంగా ఉంది. అయితే  ఇప్పటివరకు భారత్‌లో అగ్రస్థానంలో ఉన్న శాంసంగ్‌ తన ర్యాంక్‌ను నిలుపుకోవడంలో విఫలమైంది.  కేవలం  7.3 మిలియన్ స్మార్ట్‌ఫోన్లతో (25 శాతం వాటా) రెండవ స్థానంలో నిలిచిందని తెలిపింది. బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లు మాత్రమే కాకుండా.. దేశంలోఇటీవల షావోమి షోం రూంలను ప్రారంభించడం కూడా కీలకమైన పరిణామమని పేర్కొంది. స్వయంప్రతిపత్తితో   స్థానికంగా వ్యాపారాలను ప్రారంభించడంతో   షావోమి వృద్దికి దోహదపడిందని కానల్స్ రీసెర్చ్ అనలిస్ట్ ఇషాన్ దత్ చెప్పారు.

మొత్తంమీద భారతీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ 6 శాతం పుంజుకోగా మొత్తం  యూనిట్లు 30 మిలియన్లుగా నమోదయ్యాయి.  అలాగే వివో, ఒప్పో, లెనోవో  ఈ జాబితాలో తరువాత స్థానాల్లో నిలిచాయి.  
 

మరిన్ని వార్తలు