షావోమి సంచలనం.. రూ.13 వేలకే స్మార్ట్‌ టీవీ

2 Mar, 2018 21:35 IST|Sakshi

సాక్షి, ముంబై : చవక ఫోన్‌లతో భారత్‌లో పాగావేసిన షావోమి మరో అడుగు ముందుకేసింది. ఇటీవలే టెలివిజన్‌ మార్కెట్‌లో ప్రవేశించి సంచలనం సృష్టించిన షావోమి, టీవీ మార్కెట్‌లోను తన మార్క్‌ కోసం తనదైన ముద్ర కోసం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రూ. 40 వేలకు 55 అంగుళాల స్మార్ట్‌ టీవీని లాంచ్‌ చేసి ప్రముఖ కంపెనీల గుండెల్లో దడ పుట్టించింది. ఇదే క్రమంలో భారత్‌లోని టీవీ మార్కెట్‌పై కన్నేసిన షావోమి మధ్య తరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకొని మిడ్‌ రేంజ్‌ టీవీలను లాంచ్‌ చేయనుంది. ఇందులో భాగంగానే 15వేల కంటే తక్కువ ధరలో 32 అంగుళాల టీవీని మార్కెట్లోకి విడుదల చేసే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం.

హైడెఫినేషన్‌ క్వాలీటీతో రూ.12,999లకే 32 అంగుళాల స్మార్ట్‌ టీవీని షావోమీ తీసుకు రానున్నట్లు ప్రముఖ టెక్నాలజీ వార్తా సంస్థ  ఐగ్యాన్‌ ప్రచురించింది. ఇందులో 1జీబీ ర్యామ్‌తో పాటు 4జీబీ ఇంటర్నల్‌ మెమెరీని నిక్షిప్తం చేసినట్లు తెలిపింది. అంతేకాకుండా రూ.21,999లకే 43 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ టీవీని అందిస్తున్నట్లు పేర్కొంది. ఇందులో 2జీబీ ర్యామ్‌, 8జీబీ ఇంటర్నల్‌ మెమోరీ అందుబాటులో ఉంటాయని ఐగ్యాన్‌ తెలిపింది. అంతేకాకుండా బ్లూటూత్‌ 4.2 వెర్షన్‌, వైఫై సౌకర్యం కూడా ఇందులో ఉన్నట్లు పేర్కొంది. ఎంఐ 4ఏ సిరీస్‌లో వీటిని లాంచ్‌ చేసే అవకాశం ఉంది.  మార్చి 7న వీటిని అధికారికంగా లాంచ్‌ చేయనున్నట్లు షావోమి తన అధికారిక యాప్‌లో ప్రకటించింది.

32 అంగుళాల టీవీ ఫీచర్లు
స్క్రీన్‌: 32 అంగుళాలు
ర్యామ్‌: 1జీబీ
ఇంటర్నల్‌ మెమెరీ : 4జీబీ
ఆపరేటింగ్‌ సిస్టమ్‌ : ప్యాచ్‌ (ఆండ్రాయిడ్‌)
వీడియో టైప్‌ : ఫుల్‌ హెచ్‌డీ
ధర : రూ.12, 999 (అంచనా)

43 అంగుళాల టీవీ ఫీచర్లు
స్క్రీన్‌: 43 అంగుళాలు
ర్యామ్‌: 2జీబీ
ఇంటర్నల్‌ మెమెరీ : 8జీబీ
ఆపరేటింగ్‌ సిస్టమ్‌ : ప్యాచ్‌ (ఆండ్రాయిడ్‌)
వీడియో టైప్‌ : ఫుల్‌ హెచ్‌డీ, 4కే
ధర : రూ.21, 999 (అంచనా)

మరిన్ని వార్తలు