జియోఫోన్‌కు పోటీ : తక్కువ ధరకే షావోమి...

4 Aug, 2018 13:54 IST|Sakshi

టెలికాం మార్కెట్‌లో సంచలనాలు సృష్టించి, ఫీచర్‌ ఫోన్‌ మార్కెట్‌లోనూ తనదైన శైలిలో దూసుకుపోతున్న రిలయన్స్‌ జియోకు చెక్‌ పడబోతుంది. చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమి, రిలయన్స్‌ జియోఫోన్‌కు పోటీగా వచ్చేస్తోంది. షావోమి అత్యంత తక్కువ ధరకు క్విన్‌ ఏఐ సిరీస్‌లో రెండు ఫీచర్‌ ఫోన్లను తన స్వదేశంలో లాంచ్‌ చేసింది. వీటిని భారత్‌లోనూ ప్రవేశపెట్టాలని చూస్తోంది. ఏఐ ఆధారితంగా ఈ ఫీచర్‌ ఫోన్లు రూపొందాయి. జియో కియా ఓఎస్‌ను వాడితే, షావోమి ఒక స్టెపు ముందుకు వేసి దీనిలో ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ను పొందుపరిచింది. 

క్విన్‌ 1, క్విన్‌ 1 ఎస్‌ పేరుతో ఈ ఫీచర్‌ ఫోన్లు వచ్చాయి. ఇవి కేవలం ఫీచర్‌ ఫోన్లు మాత్రమే కాదు. మరిన్ని స్మార్ట్‌ ఫీచర్లను వీటిలో షావోమి అందిస్తోంది. 17 రకాల అంతర్జాతీయ భాషలను ఇది సపోర్టు చేస్తోంది. క్విన్‌ 1 కేవలం 2జీ ఫోన్‌ కాగ, క్విన్‌ 1ఎస్‌ 4జీ ఎల్‌టీఈ, వాయిస్‌ఓవర్‌ ఎల్‌టీఈను సపోర్టు చేస్తుంది. క్విన్‌ 1 ధర  సీఎన్‌ఐ 199 అంటే సుమారు భారత కరెన్సీలో 1,990 రూపాయలు. క్విన్‌ 1ఎస్‌ ధర సీఎన్‌వై 299 అంటే 2,990 రూపాయలు. ఈ రెండు ఫీచర్‌ ఫోన్లు బ్లాక్‌ అండ్‌ వైట్‌ రంగుల్లో అందుబాటులోకి వస్తున్నాయి. సెప్టెంబర్‌ 15 నుంచి వీటి షిప్పింగ్స్‌ ప్రారంభమవుతాయి. 

స్పెషిఫికేషన్లు...
2.8 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే
కార్నింగ్‌ గొర్రిల్లా గ్లాస్‌
క్విన్‌ 1లో మీడియోటెక్‌ ఎంటీ6260ఏ చిప్‌ సెట్‌, ఏఆర్‌ఎం7 సీపీయూ కోర్‌
క్విన్‌ 1ఎస్‌లో డ్యూయల్‌ కోర్‌టెక్స్‌ ఏ53 కోర్స్‌తో స్ప్రెడ్ట్రమ్ ఎస్‌సీ9820 చిప్‌సెట్‌
క్విన్‌ 1లో 8 ఎంబీ ర్యామ్‌, 16 ఎంబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
క్విన్‌ 1ఎస్‌లో 256 ఎంబీ ర్యామ్‌, 512 ఎంబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
మైక్రో ఎస్డీ కార్డు ద్వారా విస్తరణ మెమరీ
1480 ఎంఏహెచ్‌ బ్యాటరీ
ఈ ఫోన్‌లో కెమెరాలు లేవు
ఒకవేళ భారత మార్కెట్‌లోకి ఈ ఫోన్లు ప్రవేశిస్తే, కచ్చితంగా జియో ఫోన్‌కు గట్టి పోటీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు