మార్కెట్లోకి రెడ్‌మి నోట్‌ 6 ప్రో

23 Nov, 2018 02:33 IST|Sakshi

ధర రూ.13,999 నుంచి ప్రారంభం

న్యూఢిల్లీ: చైనాకి చెందిన ఎలక్ట్రానిక్స్‌ సంస్థ షావోమీ తాజాగా భారత మార్కెట్లో రెడ్‌మి నోట్‌ 6 ప్రో ఫోన్‌ను ఆవిష్కరించింది. ఇందులో 4జీబీ ర్యామ్, 64జీబీ మెమరీ ఉండే ఫోన్‌ ధర రూ.13,999 కాగా, 6జీబీ + 64జీబీ వేరియంట్‌ ధర రూ. 15,999గా ఉంటుంది. నవంబర్‌ 23న (శుక్రవారం) మి.డాట్‌కామ్, ఫ్లిప్‌కార్ట్, మి హోమ్‌ స్టోర్స్‌లో బ్లాక్‌ ఫ్రైడే సేల్‌ సందర్భంగా రూ.1,000 డిస్కౌంట్‌పై ఇవి లభిస్తాయి. ముందు రెండు (12 ఎంపీ+5ఎంపీ), వెనుక రెండు (20ఎంపీ+2ఎంపీ) ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కెమెరాలతో మొత్తం నాలుగు కెమెరాల సెటప్‌ ఇందులో ఉంటుంది.

6.26 అంగుళాల డిస్‌ప్లే, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 636 ఆక్టా కోర్‌ ప్రాసెసర్, 64 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ తదితర ఫీచర్స్‌ ఈ ఫోన్‌ ప్రత్యేకతలు. 4జీబీ, 6జీబీ ర్యామ్‌లలో రెడ్‌మి నోట్‌ 6 ప్రో లభిస్తుందని షావోమీ వైస్‌ ప్రెసిడెంట్‌ మను జైన్‌ తెలిపారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించడంతో తమ ఉత్పత్తులపై ధరలపరంగా ఒత్తిడి ఉంటోందని ఆయన చెప్పారు. తమ ఫోన్లు, పవర్‌ బ్యాంకులను భారత్‌లోనే తయారు చేస్తున్నప్పటికీ, అవసరమైన ముడి సరుకు, కీలకమైన ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డ అసెంబ్లీ (పీసీబీఏ)ని డాలర్లలోనే కొనుగోలు చేయాల్సి వస్తుండటమే ఇందుకు కారణమన్నారు.  

మరిన్ని వార్తలు