స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ షావోమీదే..

15 May, 2018 00:20 IST|Sakshi

2018 క్యూ1లో 30 శాతం వాటాతో అగ్రస్థానం

రెండు, మూడు స్థానాల్లో శాంసంగ్, ఒప్పో

న్యూఢిల్లీ: దేశీ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో షావోమి ఆధిపత్యం కొనసాగుతోంది. 2018 తొలి త్రైమాసికంలో 30.3 శాతం వాటాతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 25.1 శాతం వాటాతో శాంసంగ్‌ రెండో స్థానానికి పరిమితం కాగా... 7.4 శాతం వాటాతో ఒప్పో మూడో స్థానంలో, 6.7 శాతంతో వివో 4వ స్థానంలో నిలిచాయి.  ట్రాన్సిషన్‌ గ్రూప్‌ 4.6 శాతం వాటాతో 5వ స్థానాన్ని సొంతం చేసుకుంది.

ట్రాన్షిషన్‌కు ఐటెల్, టెక్నో, ఇన్ఫినిక్స్, స్పైస్‌ అనే నాలుగు బ్రాండ్లున్నాయి. ఇంటర్నేషనల్‌ డేటా కార్పొరేషన్‌ (ఐడీసీ) నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. త్రైమాసికం పరంగా చూస్తే 4జీ ఫీచర్‌ ఫోన్‌ మార్కెట్‌లో 50 శాతానికిపైగా వృద్ధి నమోదయ్యింది. దీనికి రిలయన్స్‌ జియోఫోన్‌ ప్రధాన కారణం.

ఫీచర్‌ ఫోన్‌ మార్కెట్‌లో జియో 38.4 శాతం మార్కెట్‌ వాటాతో టాప్‌లో ఉంది. దీని తర్వాతి స్థానాల్లో శాంసంగ్‌ (10.4 శాతం), ట్రాన్సిషన్‌ (7.9 శాతం), లావా (6 శాతం), మైక్రోమ్యాక్స్‌ (4.7 శాతం) ఉన్నాయి.  2018 తొలి త్రైమాసికంలో (జనవరి–మార్చి) దేశంలో స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు 3 కోట్ల యూనిట్లుగా నమోదయ్యాయి. వార్షిక ప్రాతిపదికన 11 శాతం వృద్ధి నమోదయ్యింది.

మరిన్ని వార్తలు