యమహా నుంచి 125 సీసీ స్కూటర్లు

20 Dec, 2019 06:21 IST|Sakshi

ఫ్యాసినో125ఎఫ్‌ఐ @ రూ.67,430

110 సీసీ స్కూటర్లకు మంగళం

చెన్నై: యమహా మోటార్‌ ఇండియా కంపెనీ 125 సీసీ స్కూటర్‌ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. ఈ సెగ్మెంట్లో రెండు కొత్త మోడళ్లు– ఫ్యాసినో 125ఎఫ్‌ఐ, రేజర్‌125ఎఫ్‌ఐలను అందుబాటులోకి తెచ్చింది. ఫ్యాసినో స్కూటర్‌ ధరను రూ.67,430(ఎక్స్‌ షోరూమ్‌)గా నిర్ణయించామని కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (స్ట్రాటజీ అండ్‌ ప్లానింగ్‌ గ్రూప్‌) రవీందర్‌ సింగ్‌ తెలిపారు. త్వరలో స్ట్రీట్‌ ర్యాలీ 125ఎఫ్‌ఐ మోడల్‌ స్కూటర్‌ను కూడా మార్కెట్లోకి తెస్తామని చెప్పారు.

110సీసీ స్కూటర్‌ మోడళ్లను దశలవారీగా మార్కెట్‌ నుంచి ఉపసంహరిస్తామని, భవిష్యత్తులో 125 సీసీ మోడళ్లను మాత్రమే విక్రయిస్తామని  వివరించారు. ఈ ఏడాది 6.24 లక్షల టూవీలర్లను విక్రయిస్తామన్న అంచనాలున్నాయని సింగ్‌ చెప్పారు. వచ్చే ఏడాది 6.50 లక్షల టూవీలర్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం 5 శాతంగా ఉన్న తమ మార్కెట్‌ వాటాను 2025కల్లా పది శాతానికి పెంచుకోవడం లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలోనే ఎమ్‌15, ఆర్‌ 15 బైక్‌ మోడళ్లలో బీఎస్‌–సిక్స్‌ వేరియంట్లను కూడా కంపెనీ ఆవిష్కరించింది. ప్రస్తుత మందగమనం తాత్కాలికమేని, వాహన విక్రయాలు పుంజుకుంటాయని సింగ్‌ అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు