యస్‌ బ్యాంకునకు ఊరట : షేరు జంప్‌ 

3 Oct, 2019 13:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ రుణదాత యస్‌బ్యాంకునకు భారీ ఊరట లభించింది. ఇటీవల పాతాళానికి పడిపోయిన  బ్యాంకు  షేరు గురువారం నాటి ట్రేడింగ్‌ ఆరంభంలోనే ఏకంగా 20శాతం ఎగిసింది.  తద్వారా  వరుస ఐదు రోజుల పతనానికి చెక్‌ పెట్టింది. బ్యాంక్‌ ఫైనాన్షియల్‌, నిర్వహణ, అంతర్గత పరిస్థితులు పటిష్టంగా ఉన్నట్లు యస్ బ్యాంక్‌ యాజమాన్యం తాజాగా పేర్కొంది. నిబంధనలకు అనుగుణంగా లిక్విడిటీ పరిస్థితులు సైతం మెరుగ్గా  ఉన్నాయని  స్టాక్‌ ఎక్చ్సేంజీ  సమాచారంలో తెలిపింది.   దీంతో ఇన్వెస్టర్లు సెంటిమెంట్‌ బలపడి కొనుగోళ్లతో భారీగా లాభపడింది. దాదాపు ఎనిమిది నెలల్లో ఇది అతిపెద్ద లాభం.

ప్రమోటర్ రాణాకపూర్‌, తదితరులు 2.16 శాతం వాటాను విక్రయించడంతో బ్యాంకులో వాటా 4.72 శాతానికి పరిమితమైనట్లు యస్ బ్యాంక్‌ ఇప్పటికే తెలిపింది.  రాణా కపూర్‌ తనఖా పెట్టిన 10 కోట్ల షేర్లను ఉద్దేశపూర్వకంగా విక్రయించడం వల్లే షేర్లు భారీ పతనాన్ని చవిచూసినట్లు యస్‌బ్యాంక్‌ తెలిపింది. ఇప్పటికి తమ బ్యాంకు ఫైనాన్షియల్‌ ఫండమెంటల్స్‌ బలంగానే ఉన్నాయని చెప్పుకొచ్చింది. డిపాజిట్లు, నిధుల లభ్యతపై కొద్దిరోజులుగా వస్తున్న ఊహాగానాలు ఉద్దేశ్యం పూర్తిగా తెరపైకి వచ్చాయని, కనీస మూలధన పరిమితికి మించి తమ వద్ద నిధుల లభ్యత ఉన్నట్లు  తెలిపింది. షేర్ల పతనానికి అడ్డుకట్ల వేసేందుకు తక్షణ చర్యలు ప్రారంభిస్తామని ఎక్చ్సేంజీలకు ఇచ్చిన వివరణలో పేర్కొంది.  మరోవైపు బ్యాంక్‌ను కష్టాల కడలి నుంచి గట్టేక్కించే అంశంలో మేనేజ్‌మెంట్‌పై తమ పూర్తి నమ్మకం ఉందని సహ ప్రమోటర్‌ అశోక్‌ కపూర్‌ , ఆమె కుమార్తె షాగున్‌ గొగోయ్‌  ప్రకటించడం  ఇన్వస్టెర్లకు మరింత  ఊతమిచ్చింది

మరోవైపు బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ రజత్ మోంగా రాజీనామా చేసినట్లు సీఈవో రవ్‌నీత్‌ గిల్ గురువారం ప్రకటించారు. 2004లో  చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్  బ్యాంకులో చేరిన మోంగా తదనంతరకాలంలో టాప్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఎదిగారు.

కాగా మంగళవారం తనఖా షేర్లను ఇన్‌స్టిట్యూషన్స్‌ విక్రయించడంతో దాదాపు 30 శాతం పడిపోయింది. రూ. 29 వద్ద షేరు ఒక దశాబ్దం కనిష్టానికి పడిపోయిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు