5 శాతం పతనమైన షేరు
ఈ నెల 15-17 మధ్య ఇష్యూ
పెట్టుబడికి ఎస్బీఐ, ఎల్ఐసీ రెడీ
ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్పీవో)కు ఫ్లోర్ ధరను రూ. 12గా నిర్ణయించింది. ఇది గురువారం ముగింపు ధర రూ. 26.6తో పోలిస్తే 55 శాతం తక్కువ కావడం గమనార్హం! ఎఫ్పీవో ఈ నెల 15న ప్రారంభమై 17న ముగియనుంది. తద్వారా రూ. 15,000 కోట్లవరకూ సమీకరించాలని యస్ బ్యాంక్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో యస్ బ్యాంక్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 5 శాతం పతనమై రూ. 25 వద్ద ట్రేడవుతోంది.
రూ. 1 డిస్కౌంట్
అర్హతగల ఉద్యోగులకు యస్ బ్యాంక్ ఎఫ్పీవో ధరలో రూ.1 డిస్కౌంట్ ప్రకటించింది. ఎఫ్పీవోలో భాగంగా 1,000 షేర్లను ఒకలాట్గా కేటాయించనుంది. దీంతో ఇన్వెస్టర్లు కనీసం 1,000 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. వెరసి రూ. 12,000 కనీస పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. యస్ బ్యాంకులో అతిపెద్ద వాటాదారు ఎస్బీఐ రూ. 1760 కోట్లవరకూ ఈ ఎఫ్పీవోలో ఇన్వెస్ట్ చేయనుంది. ఇందుకు ఎస్బీఐ బోర్డు గ్రీన్సిగ్నల్ఇచ్చిన విషయం విదితమే. ఈ బాటలో ఇతర సంస్థలు టిల్డెన్ పార్క్, ఎల్ఐసీ, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్ తదితరాలు సైతం ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి.