వారికి షాకే : ఇక షాపింగ్‌ మాల్స్‌లో పెట్రోల్‌

19 Jun, 2019 11:11 IST|Sakshi

 షాపింగ్‌ మాల్స్‌  లేదా   సూపర్‌ మార్కెట్ల ద్వారా  ఇంధన విక్రయం

మాల్స్‌లో పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలకు త్వరలోనే  అనుమతి

సాక్షి, న్యూఢిల్లీ :  పెట్రోల్‌ బంకుల  యాజమాన్యాలకు షాకిచ్చేలా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఒక సంచలన నిర్ణయం తీసుకోనుంది. షాపింగ్‌ మాల్స్‌  లేదా  సూపర్‌ మార్కెట్లలో  రీటైల్‌గా పెట్రోల్, డీజిల్‌లను అందుబాటులో ఉంచాలని కేంద్రం ఆలోచిస్తున్నట్టుగా సమాచారం.  సంబంధిత  అనుమతులను త్వరలోనే మంజూరు చేయనుంది. ఈ మేరకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ తొందరలోనే  క్యాబినెట్‌ నోట్‌ను తీసుకురానుంది. ప్రస్తుత నిబంధనలను సడలించేందుకు కసరత్తు చేస్తోందని బిజినెస్ స్టాండర్డ్ నివేదించింది.

ఆర్థికవేత్త కిరిట్ పరిఖ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల కమిటీ ఇంధన రీటైలింగ్‌ విధానానికి సంబంధించి భారతదేశంలో సడలింపు నిబంధనలను ప్రతిపాదించింది. అతి సులభంగా, తగ్గింపు ధరల్లో ఇంధనాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని   సూచించింది. మాజీ పెట్రోలియం కార్యదర్శి జిసి చతుర్వేది, మాజీ ఇండియన్ ఆయిల్ (ఐఓసి) చైర్మన్ ఎంఏ పఠాన్, పెట్రోలియం మంత్రిత్వ శాఖ మార్కెటింగ్ ఇన్‌ఛార్జి జాయింట్ సెక్రటరీ అశుతోష్ జిందాల్ ఈ కమిటీలో  సభ్యులుగా ఉన్నారు.

మే 30న రెండవ సారి అధికార పగ్గాలు  చేపట్టిన మోదీ సర్కార్‌  100 రోజుల్లేనే ఈ విధానాన్ని అమల్లోకి తేవాలని భావించిందట. దీని ప్రకారం సెప్టెంబర్‌మొదటి వారంలో  దీనికి సంబంధించిన విధి విధానాలు తుది రూపు దాల్చనున్నాయి.  తద్వారా  సంస్థల ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ఇది సూచించే అవకాశం ఉంది. అలాగే  ప్రభుత్వం దేశీయ మార్కెట్లో ప్రాథమిక మౌలిక సదుపాయాల పెట్టుబడి పరిమితిని రూ.2 వేల కోట్లనుంచి తగ్గించనుంది.  లేదా 3 మిలియన్ టన్నుల (30 లక్షల టన్నులు) లేదా దీనికి సమానమైన మొత్తానికి బ్యాంక్ గ్యారెంటీలను అందించనుందని రిపోర్టులో తెలిపింది. అదే జరిగితే పెట్రో బంకులకు గట్టి దెబ్బ తప్పదనే చెప్పాలి.  బంకుల్లో జరిగే మోసాలకూ అడ్డుకట్టపడే అవకాశం ఉంది.

సూపర్ మార్కెట్ల ద్వారా రిటైల్ ఇంధన విక్రయాలను అనుమతించే విధానం యునైటెడ్ కింగ్‌డమ్ (యుకె)లో విజయవంతంగా అమల్లో ఉంది. ఇదిలా ఉండగా, గత ఏడాది మార్చి 16న పూణేలో పెట్రోల్‌  హోండెలివరీ సదుపాయాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం ఇండియన్ ఆయిల్ కార్ప్ (ఐఓసి), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీవో) హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పిసిఎల్) లాంటి ప్రభుత్వ ఇంధన రిటైలర్లు పూణే, ఢిల్లీ, జౌన్‌పూర్, చెన్నై, బెంగళూరు, అలీగఢ్‌, దుదైపూర్, రేవారి, నవీ ముంబైలో పెట్రోలు హోం డెలివరీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు