బ్యాంకు డిపాజిటర్లకు శుభవార్త: బీమా కవరేజీ పెంపు?

18 Nov, 2019 13:46 IST|Sakshi

సాక్షి,  న్యూఢిల్లీ: బ్యాంకుల్లో డిపాజిట్ చేసే వినియోగదారులకు మరింత భరోసా కల్పించేలా కేంద్ర ఆర్థిక శాఖ నుంచి శుభవార్త అందనుంది. ప్రస్తుత ఆర్థిక  సంవత్సరంలో డిపాజిట్ బీమా పరిమితిని ఊహించిన దానికంటే ఎక్కువ పెంచనుందని తెలుస్తోంది. ముఖ్యంగా రూ .1 లక్ష నుండి రూ .5 లక్షలకు పెంచవచ్చనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. హోల్‌సేల్ డిపాజిటర్లకు డిపాజిట్ బీమాను రూ.25 లక్షలకు పెంచే కొత్త పథకాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టే అవకాశం ఉందని ‘బిజినెస్ స్టాండర్డ్’ తెలిపింది. ఈ పెంపు అమల్లోకి వస్తే, డిపాజిట్ బీమాకు సంబంధించి ఇదే మొదటి పెంపు అవుతుంది. 

ఆర్థిక మంత్రిత్వ శాఖ రెండు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. మొదటిది, చాలాకాలంగా పెండింగ్‌లో అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా వ్యక్తులు, లేదా సంస్థలకు ప్రతిపాదిత మెరుగైన పరిమితులకు మించి అదనపు డిపాజిట్ బీమాను పొందడానికి బ్యాంకులను అనుమతించడం. రెండవది, ఆర్‌బీఐ నియంత్రణలోని డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డిఐసిజిసి), పంజాబ్ అండ్‌ మహారాష్ట్రల మాదిరిగానే మోసాల కారణంగా నష్టపోతున్న డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రత్యేక రిజర్వ్‌ను ఏర్పాటు చేయడం. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో డిసెంబర్ 13న జరిగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కేంద్ర బోర్డు సమావేశంలో వీటిపై చర్చించే అవకాశం ఉంది. 

బ్యాంకు డిపాజిట్లపై ప్రస్తుతం అమలులో ఉన్న రూ.1 లక్ష బీమా కవరేజీని పెంచే అవకాశమున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రెండు రోజుల క్రితం మీడియా సమావేశంలో చెప్పారు. మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకుల నియంత్రణకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఈ రెండింటికీ సంబంధించి ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చట్టాల్ని తీసుకొస్తామని చెప్పారు. సహాకార బ్యాంకుల సంక్షోభాల్ని కట్టడి చేసేందుకు త్వరలో కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేస్తామన్నారు. ఇప్పటికే బిల్లు రూపకల్పన జరిగిందని, క్యాబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంటులో ప్రవేశపెట్టి అమలులోకి తీసుకు వస్తామన్నారు. పీఎంసీ బ్యాంక్‌లో జరిగిన మోసాలు మళ్లీ జరుగకూడదనే ఉద్దేశంతో ప్రస్తుతం ఉన్న బ్యాంకుల మార్గదర్శకాలను మార్చి నూతన ప్రణాళికను ప్రకటించనున్నట్లు తెలిపారు. తాజా పీఎంసీ కుంభకోణంలో పీఎంసీ డిపాజిటర్లు పెద్ద మొత్తంలో నష్టపోయిన నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా ప్రస్తుతం బ్యాంకు డిపాజిటర్లు జమ చేసే మొత్తాలపై డిపాజిట్ ఇన్సురెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పోరేషన్ రూ.1 లక్ష వరకు బీమా కవరేజీని అందిస్తోంది. 1992 సెక్యూరిటీల కుంభకోణంతో బ్యాంక్ ఆఫ్ కరాడ్ కుప్పకూలిన తరువాత, 1993 నుంచి డిపాజిట్ ఇన్సురెన్స్ రూ.1 లక్ష వరకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. 

>
మరిన్ని వార్తలు