జియో ప్రైమ్‌ ముగుస్తోంది, బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఉంటుందా?

13 Mar, 2018 09:00 IST|Sakshi
జియో ప్రైమ్‌ (ఫైల్‌ ఫోటో)

ముంబై : దేశీయ టెలికం రంగంలో కాలు మోపినప్పటి నుంచి సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన రిలయన్స్ జియో, ఆరంభం నుంచి అదిరిపోయే ఆఫర్లను ప్రకటిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గతేడాది జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను రూ.99కి వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. 2017 మార్చి 31 వరకు ఈ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను ఎన్‌రోల్‌ చేసుకునే అవకాశం ఇచ్చిన జియో, సరిగ్గా ఏడాది పాటు దీనిపై పలు ప్రయోజనాలు అందించనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం జియో ప్రకటించిన ఆ ఏడాది గడువు పూర్తి కావొస్తోంది. మరికొన్ని రోజుల్లో అంటే ఈ నెల చివరికి ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ గడువు తీరిపోతుంది. అయితే తరువాత పరిస్థితి ఏమిటోనని యూజర్లు సందిగ్ధలో పడ్డారు. తరువాత కూడా ఈ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను పొడిగిస్తారా లేదా మరేదైనా ప్లాన్‌ తీసుకొస్తారా అని జియో యూజర్లందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు జియో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ఉన్నవారికి అదనపు మొబైల్ డేటాతోపాటు రూ.10వేల విలువైన జియో యాప్స్ కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను ఏడాది పాటు ఉచితంగా అందిస్తూ వచ్చింది రిలయన్స్‌ జియో.
 
ప్రస్తుతం జియో కంపెనీకి 160 మిలియన్‌కు పైగా కస్టమర్లున్నారు. వారిలో 80 శాతం మంది జియో ప్రైమ్‌ను సబ్‌స్క్రైబ్‌ చేసుకున్న వారే. మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవడానికి ముఖేష్‌ అంబానీ మరేదైనా మ్యాజిక్‌ చేయనున్నారా? అని కూడా టెలికాం వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే జియో కంపెనీ, పార్టనర్ల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం జియో ప్రైమ్ మెంబర్‌షిప్ గడువును రూ.99కే మరో ఏడాదిపాటు పొడిగించే అవకాశముందని తెలుస్తోంది.  ఇప్పటి వరకు జియో ప్రైమ్‌ కింద అందిస్తున్న ప్రయోజనాలను మరో ఏడాది పాటు అందిస్తుందని చెబుతున్నారు.

ఇంకా దీనిపై ఎలాంటి సమాచారం లేనప్పటికీ, మార్చి చివరి వారంలో బిగ్‌ సర్‌ప్రైజే ఉండొచ్చని జియో వర్గాలంటున్నాయి. జియో ట్రాక్‌ రికార్డును పరిశీలిస్తే, తన ప్రైమ్‌ మెంబర్లకు ఎప్పడికప్పుడు కంపెనీ సర్‌ప్రైజింగ్‌ ఆఫర్లనే ప్రవేశపెట్టిందని, కస్టమర్లను కాపాడుకోవడానికి ఈ సారి అలానే సర్‌ప్రైజ్‌ చేయొచ్చని జియో పార్టనర్లు, స్టోర్లు అభిప్రాయ వ్యక్తంచేస్తున్నాయి. మరికొందరు జియో ప్రైమ్ మెంబర్‌షిప్ గడువు పెంపు ఏమీ ఉండదని, కానీ జియో యాప్స్‌ను వాడితే చార్జి వసూలు చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ప్రైమ్ మెంబర్‌షిప్‌పై జియో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
 

మరిన్ని వార్తలు