ఉగాదికి యప్‌ టీవీ సొంత సీరియల్స్‌

16 Mar, 2017 21:29 IST|Sakshi
ఉగాదికి యప్‌ టీవీ సొంత సీరియల్స్‌

► ‘ఎందుకిలా’ సిరీస్‌ ప్రారంభం
► బ్రాండ్‌ అంబాసిడర్‌గా మహేశ్‌ బాబు


హైదరాబాద్ :
ఓవర్‌ ది టాప్‌ కంపెంట్‌ (ఓటీటీ) సేవలందించే యప్‌ టీవీ.. సొంతంగా సీరియల్స్‌ నిర్మించడంలో నిమగ్నమైంది. ఇందుకోసం యప్‌ టీవీ ఒరిజినల్స్‌ పేరిట ప్రత్యేక విభాగాన్ని కూడా ప్రారంభించింది. యప్‌ టీవీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబును నియమించుకున్నట్లు సంస్థ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ ఉదయ్‌ రెడ్డి గురువారమిక్కడ విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయ్‌ మాట్లాడుతూ.. సీరియల్స్, కార్యక్రమాలను రూపొందించడం కోసం ఐ క్యాండీ క్రియేషన్స్, ఎర్లీ మార్నింగ్‌ టాలెస్, ట్రెండ్‌లౌడ్, మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌ వంటి సంస్థలతో భాగస్వామ్యమయ్యామని చెప్పారు.

ప్రముఖ దర్శకులు దేవా కట్టా (ఐ క్యాండీ క్రియేషన్స్‌) నిర్మించిన ‘ఎందుకిలా’ సీరియల్‌ పూర్తయిందని.. ఉగాదికి ప్రసారమవుతుందని కూడా చెప్పారు. ఆయా సీరియల్స్, కార్యక్రమాలు ఎపిసోడ్ల వారీగా ప్రసారమవుతాయని తెలియజేశారు. ముందుగా తెలుగులో రూపొందిస్తామని ఆ తర్వాత తమిళం, హిందీ ఇతర బాషాలకు విస్తరిస్తామని తెలిపారు. అలాగే భవిష్యత్తులో సినిమాలు కూడా నిర్మిస్తామని పేర్కొన్నారు. ఇప్పటివరకు యప్‌ టీవీ 73 మిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించింది. 50 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులతో ఎమరాల్డ్‌ మీడియా వాటాను కొనుగోలు చేసింది.

పార్క్‌ హయత్‌ హోటల్‌ ఫుడ్‌లో జెర్రి..
అయితే నగరంలో ప్రముఖ హోటల్స్‌లో ఒకటైన పార్క్‌ హయత్‌లో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమం అనంతరం మీడియా ప్రతినిధులకు ఏర్పాటు చేసిన భోజనంలో జెర్రి ప్రత్యక్షమైంది. ఓ మీడియా ప్రతినిధి తింటున్న స్వీట్‌లో జెర్రి కనిపించేసరికి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు అక్కడి ప్రతినిధులు. వెంటనే సంబంధిత హోటల్‌ ప్రతినిధులకు ఈ విషయాన్ని చెప్పి.. ఇదేంటని ప్రశ్నించగా ‘‘అప్పుడప్పుడు ఇలా జరుగుతుందని’’ లైట్‌ తీసుకోండని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు హోటల్‌ ప్రతినిధులు. సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, ప్రముఖ దర్శకులు దేవా కట్టా, నందినీ రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఇలాంటి భోజనం పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

మరిన్ని వార్తలు