ట్రిపుల్‌ప్లే సేవలు: బీఎస్‌ఎన్‌ఎల్‌తో యప్‌ టీవీ జోడీ..

24 Jan, 2020 11:31 IST|Sakshi
ఫైల్‌ఫోటో

సాక్షి, న్యూఢిల్లీ : గ్రామీణ ప్రజలకు, బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లకు ట్రిపుల్‌ ప్లే సర్వీసులు అందించేందుకు ఓటీటీ కంటెంట్‌లో గ్లోబల్‌ లీడర్‌ యప్‌ టీవీ బీఎస్‌ఎన్‌ఎల్‌తో కలిసి పనిచేస్తుంది. ఈ ఏడాదిలో తెలంగాణ సర్కిల్‌తో పాటు సౌత్‌ జోన్‌లో సేవలు మొదలవనున్నాయి.  ఈనెల 22న ఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్‌ సెంటర్‌లో టెమా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా వీణవంక గ్రామంలో భారత్‌ ఎయిర్‌ఫైబర్‌ సేవలను వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రారంభించింది. భారత్‌ ఎయిర్‌ఫైబర్‌ బిజినెస్‌ మోడల్‌ గురించి బీఎస్‌ఎన్‌ఎల్‌ డైరెక్టర్‌ (సీఎఫ్‌ఏ) వివేక్‌ బంజల్‌ వివరిస్తూ గ్రామీణ ప్రాంత గృహాలకు హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించే క్రమంలో ఈ భాగస్వామ్యం ఉపకరిస్తుందని చెప్పారు.​ గ్రామీణ గృహాలకు రేడియో ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందిచేందుకు గ్రామస్ధాయి వాణిజ్యవేత్తలు బీఎస్‌ఎన్‌ఎల్‌తో చేతులు కలిపే విధానాన్ని ప్రకటిస్తున్నామని చెప్పారు.

యప్‌ టీవీ వ్యవస్ధాపక సీఈవో ఉదయ్‌ రెడ్డి మాట్లాడుతూ దేశంలో తదుపరి డిజిటలీకరణలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టును బీఎస్‌ఎన్‌ఎల్‌తో కలిసి తాము చేపట్టడం సంతోషకరమని అన్నారు. గ్రామీణ భారతానికి హైస్పీడ్‌ ఇంటర్‌నెట్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌ చేరువ చేస్తే తాము తమ యూజర్లకు వినోదభరితంగా వారిని చైతన్యపరిచేలా వైవిధ్యమైన కంటెంట్‌ను అందించే బాధ్యత తీసుకుంటామని అన్నారు. సౌత్‌ జోన్‌తో ప్రారంభమైన ఈ ప్రక్రియకు అద్భుత స్పందన వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. కాగా బీఎస్‌ఎన్‌ఎల్‌ సబ్‌స్క్రైబర్లకు కంటెంట్‌ను అందించేలా గత ఏడాది బీఎస్‌ఎన్‌ఎల్‌తో యప్‌ టీవీ ఓ అవగాహనా ఒప్పందంపై సంతకం చేసిన క్రమంలో తదనుగుణంగా ఎంపిక చేసిన సర్కిళ్లలో ట్రిపుల్‌ ప్లే సర్వీసులను బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రారంభించింది.

చదవండి : అసెట్స్‌ విక్రయంలో బీఎస్‌ఎన్‌ఎల్‌

చదవండి : యప్‌ టీవీ చేతికి బీసీసీఐ డిజిటల్‌ రైట్స్‌

>
మరిన్ని వార్తలు