మరుగుదొడ్డి కట్టనీయలేదని మామపై కోడలి ఫిర్యాదు

5 Feb, 2018 10:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చిత్తూరు, పూతలపట్టు : మరుగుదొడ్డి కట్టనీయకుండా మామ  అడ్డుకుంటున్నాడని ఓ కోడలు ఆదివారం పోలీసులకు ఫిర్యా దు చేసింది. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని పేటఅగ్రహారం దళితవాడకు చెందిన ఎర్రయ్య కుమారుడు బాబయ్య 20 ఏళ్ల క్రితం పీలేరుకు చెందిన విజయకుమారిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో బాబయ్య ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి విజయకుమారి తన కుమార్తెతో పాటు పూరిగుడిసెలో ఉంటూ కూలి చేసుకుని జీవనం సాగి స్తోంది.

ప్రస్తుతం మరుగుదొడ్డి ఉంటేనే సంక్షేమ పథకాలైన పింఛను, రేషన్‌ బియ్యం, ఇతర సౌకర్యాలు అందిస్తామని అధికారులు తెలిపారు. రెండు నెలలుగా పింఛను కూడా ఇవ్వడం లేదు. తీరా మరుగుదొడ్డి నిర్మించుకోబోతే మామ ఎర్రయ్య అడ్డుపడ్డాడు. దీంతో ఆమె మనోవేదనకు గురై ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సిబ్బంది ద్వారా గ్రామంలో విచారించిన ఎస్‌ఐ మురళీమోహన్‌ ఎర్రయ్యను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు అడ్డుపడొద్దని హెచ్చరించి పంపారు.

మరిన్ని వార్తలు