ఆ నలుగురితో పార్టీ పరువు గోవిందా

18 Jan, 2018 03:00 IST|Sakshi

సీఎంకు పాకాల టీడీపీ నేతల ఫిర్యాదు

వివరాలతో సహా వివరించిన వైనం

వారివల్ల పార్టీ నష్టపోతోందని ఆవేదన

సాక్షి, తిరుపతి :‘నలుగురు కిడ్నాపర్లు.. స్మగ్లర్లు టీడీపీని అడ్డుపెట్టుకుని అవినీతి, అరాచకాలకు పాల్పడుతున్నారు. ఆ నేతలపై కఠిన చర్యలు తీసుకోండి’ అని అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫి ర్యాదు చేశారు. సంక్రాంతి వేడుకలకు వచ్చిన ముఖ్యమంత్రితోపాటు మంత్రి లోకేష్‌ను పాకాల మండలం నేతలు మంగళవారం కలిశారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బెల్ట్‌షాపులు నడిపేవారు, కిడ్నాపర్లు, ఎర్రస్మగ్లర్లు పార్టీలో తిష్టవేసి అరాచకాలు చేస్తున్నారని పేర్కొన్నారు.

 గల్లా అరుణకుమారి, బాలకృష్ణారెడ్డి పేర్లతో మండలంలో దందాలు చేస్తూ లక్షలు వసూలు చేస్తున్నారని తెలిపారు. మండల స్థాయిలో రెవెన్యూ పంచాయతీరాజ్, ఎక్సైజ్‌ ఇలా అన్ని విభాగాల్లో మా మూళ్లు వసూలు చేస్తున్నారని, ఇవ్వని వారపై వేధింపులకు దిగుతున్నారని ముఖ్యమంత్రికి చెప్పారు. పార్టీని అడ్డంగా అమ్మేస్తున్నారని, పరువు బజారున పడిందని వివరించారు. ఆ నలుగురి కారణంగా పార్టీ కేడర్‌ నిస్సహాయ స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై పూర్తిస్థాయిలో విచారణ చేసి పార్టీ నుంచి బహిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. 

నాగరాజనాయుడే సూత్రధారి
పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజనాయుడు మద్యం మాఫి యాను ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈయ న మండలంలోని మిగిలిన మద్యం షాపులపై పెత్తనం చెలా యిస్తూ మాటవినని వారిపై తప్పుడు కేసులు బనాయించేలా చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మాట వినని అధికార పార్టీ నేతలపైనా కేసులు పెట్టి బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వెళ్లగక్కారు. ఆయన అనుమతిలేనిదే ఎవరికీ ఎలాంటి పనులు మంజూరు చేయవద్దని మండల కార్యాలయాల్లో దౌర్జన్యానికి దిగుతున్నట్లు వివరించారు. పర్సెంటేజీ ఇస్తే తప్ప అభివృద్ధి పనులు మంజూరు కావని బహిరంగానే చెబుతున్నారని, దీంతో పార్టీ కేడర్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఫిర్యాదు చేశారు. జెడ్పీటీసీ సురేష్‌ బంధువు కావడంతో వీరి అరాచకాలు మితిమీరినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 

పార్టీలో కిడ్నాపర్లు, స్మగ్లర్లు
పాకాల మండలం టీడీపీలో కిడ్నాపర్లు, స్మగ్లర్లు పెత్తనం చెలాయిస్తున్నారంటూ చలపతినాయుడు, కిశోర్‌నాయుడిపై ఫిర్యాదు చేశారు. పార్టీ నాయకులుగా చెలామణి అవుతున్న వీరు ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తూ ఇప్పటికే పట్టుపడ్డారని చెప్పారు. మూడేళ్లుగా వీరి అరాచకాలకు అడ్డేలేకుండా పోయిందన్నారు. వీరిని పార్టీ నుంచి బహిష్కరించాలని కోరారు. వీరి ఫిర్యాదుపె కంగుతిన్న ఆ నలుగురు నేతలు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్‌ గల్లా అరుణకుమారి, గతంలో ఆమెకు పీఏగా పనిచేసిన బాలకృష్ణారెడ్డిని ప్రసన్నం చేసుకునే పనిలో పడినట్లు తెలిసింది. 

మరిన్ని వార్తలు