సాక్షి, చిత్తూరు: ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 700 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం జమ్మివారిపల్లె వద్ద ప్రజా సంకల్ప యాత్ర ఏడువందల కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా పెట్రోల్ బంక్ సమీపంలో వైఎస్ జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించి, మొక్కను నాటారు.
మొక్కవోని సంకల్పం
ప్రజలకు అండగా ఉండాలని పాదయాత్ర ద్వారా గతేడాది నవంబర్ 6వ తేదీన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రతి వంద కిలోమీటర్లకు ఒక మొక్కను నాటుతూ ఆయన ముందుకు సాగుతున్నారు. వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర నవంబర్ 14న కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 100 కిలోమీటర్లు మైలురాయి, డోన్ నియోజకవర్గంలో 200 కిలోమీటర్ల మైలు రాయిని దాటిన 21వ రోజు పాదయాత్రలో భాగంగా జననేత జగన్ 300 కిలోమీటర్ల మైలు రాయిని కూడా కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గం బి.అగ్రహారం వద్ద పూర్తి చేసుకున్నారు.
29 రోజు పాదయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా గుమ్మేపల్లిలో 400 కి.మీ మైలురాయిని చేరుకున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం ఉట్లూరు గ్రామంలో 500 కిలోమీటర్లు, డిసెంబర్ 24న అనంతపురం జిల్లా ఉట్లూరు వద్ద 600 కిలోమీటర్ల మైలు రాయిని దాటారు. ఇవాళ చిత్తూరు జిల్లా జమ్మివారిపల్లెలో 700 కిలోమీటర్లు పూర్తి చేశారు. జననేతకు తమ సమస్యలు చెప్పుకునేందుకు భారీ సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు.