-

కొత్త జగజ్జేత అవతరించిన రోజు

14 Jul, 2020 12:02 IST|Sakshi

న్యూఢిల్లీ​: నరాలు తెగే ఉత్కంఠభరితమైన పోరు. ఆకాశమే హద్దుగా చెలరేగిన బ్యాట్స్​మెన్​, వికెట్లే లక్ష్యంగా బంతి విసిరిన బౌలర్లు. చివరకు మ్యాచ్ టై. ఓ సూపర్​ ఓవర్​. అది చాలక బౌండరీల లెక్కింపుతో విజేత నిర్ధారణ. క్రికెట్​లో వీటిలో ఏదో ఒకటి అప్పుడప్పుడూ జరగడం సాధారణం. కానీ అన్నీ ఒకేసారి ఒకే మ్యాచ్​లో కనిపిస్తే.. అది 2019 ప్రపంచకప్​ ఫైనల్​ అవుతుంది.వన్డే​ల హిస్టరీలోనే ఓ మైలురాయిగా నిలిచిన ఈ ఫైనల్​కు నేటితో(జులై 14) ఓ ఏడాది నిండింది. ఈ చారిత్రాక మ్యాచ్​ ఇంగ్లండ్​ జట్టు బౌండరీ ఆధారంగా న్యూజిలాండ్​పై నెగ్గి జగజ్జేతగా అవతరించింది. ఛేజింగ్​లో ఇంగ్లండ్​ బ్యాట్స్​మన్ బెన్​ స్టోక్స్​ పోరాటంతో ఆఖరి ఓవర్​లో ఆ జట్టు 15 పరుగులు చేయాల్సివుంది. అంతకుముందు డీప్​ వద్ద స్టోక్స్​ ఇచ్చిన క్యాచ్​ను ట్రెంట్​ బౌల్ట్​ జారవిడిచాడు.(‘గంగూలీలా ధోని చేయలేదు’)

ఆరు బంతులు.. 15 పరుగులు
ఆఖరి ఓవర్​లో బంతిని అందుకున్న బౌల్ట్​ తొలి రెండు డెలివరీలను డాట్స్​గా మలిచాడు. స్టైక్​లో ఉన్న స్టోక్స్​ మూడో బంతిని సిక్సర్​గా మలిచి ఇంగ్లండ్​ శిబిరంలో ఆనందం నింపాడు. ఆ తర్వాతి బంతిని ఆడిన స్టోక్స్​ పరుగు కోసం డైవ్​ చేశాడు. ఫీల్డర్​ గప్టిల్​ శరవేగంగా బంతిని త్రో చేశాడు. అది స్టోక్స్​ బ్యాట్​ను బలంగా తాకి బౌండరీ దాటింది. దీంతో న్యూజిలాండ్​ జట్టు నివ్వెరపోయింది. ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాలి. ఇంగ్లండ్​ బ్యాట్స్​మన్​ మార్క్​ వుడ్​ రనౌట్​ అయ్యాడు. దీంతో మ్యాచ్​ టై అయింది. సూపర్​ ఓవర్​లో స్టోక్స్​, జోస్​ బట్లర్​ కలిసి న్యూజిలాండ్​కు 16 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.న్యూజిలాండ్ బ్యాట్స్​మన్​ జేమ్స్ నీషమ్ ఓ సిక్సర్​ బాదాడు. చివరి బంతికి రెండు పరుగులు చేస్తే న్యూజిలాండ్​ విశ్వవిజేతగా నిలుస్తుంది. రెండు పరుగుల కోసం ఊపిరి బిగబట్టి చేసిన ప్రయత్నంలో గప్టిల్​ రనౌట్​ అయ్యాడు. దాంతో న్యూజిలాంట్​ టీమ్ నిరాశలో కూరుకుపోయింది.ఇంగ్లండ్​ క్రీడాకారుల విజయనాథంతో లార్డ్స్​ క్రికెట్​ స్టేడియం ఉర్రూతలూగింది. ఈ మ్యాచ్​లో బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లండ్​(26), న్యూజిలాండ్​(17)పై గెలుపొందింది. వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలో క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన ఇంగ్లండ్‌కు అదే తొలి కప్‌.

మరిన్ని వార్తలు