ఐపీఎల్‌ జోష్‌

9 Apr, 2018 08:19 IST|Sakshi
ఉప్పల్‌ స్టేడియంలో ఆదివారం ప్రాక్టీస్‌ చేస్తున్న సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు ధావన్, సాహా

నేటి నుంచి సిటీలో క్రికెట్‌ మ్యాచ్‌లు షురూ

తొలి రోజు రాజస్థాన్‌ రాయల్స్‌ వర్సెస్‌ సన్‌రైజర్స్‌ టీం

ఉప్పల్‌ స్టేడియంలో మొత్తం ఏడు మ్యాచ్‌లు

సిటీలో ఐపీఎల్‌ క్రికెట్‌ జోష్‌ నెలకొంది. సోమవారం నుంచి ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్‌లుమొదలవనున్నాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఇక్కడ మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడనుంది. అభిమానులు టికెట్‌ల కోసం పెద్ద ఎత్తున పోటీపడుతున్నారు. ధోనీ, కోహ్లీ, రోహిత్, ధావన్‌ వంటి స్టార్‌ క్రికెటర్లు ఆడనుండడంతో ఇక అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. ఆదివారం ఇరుజట్ల క్రికెటర్లు ప్రాక్టీస్‌ చేశారు. వీరిని చూసేందుకు క్రికెట్‌ అభిమానులు ఆసక్తి చూపారు.

హిమాయత్‌నగర్‌: దేశవిదేశీ ఆటగాళ్ల మెరుపులు చూసేందుకు చక్కని వేదిక ఐపీఎల్‌. దీంతో ఐపీఎల్‌కు ఆదరణ పెరుగుతూ వస్తోంది. ఐపీఎల్‌ 11వ సీజన్‌ ఈ ఏడాది మరింత ఊపుతో మన ముందుకొస్తోంది. ఇప్పటికే నగరంలో జరిగే 7 మ్యాచ్‌లకు దాదాపు టికెట్లు బుక్‌ అయ్యాయి. 

తొలి ఆటపై ఆసక్తి..  
సన్‌రైజర్స్‌ హైదరాబాద్, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య నేడు జరగనున్న తొలి మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. మొదటి మ్యాచ్‌లో విజయం సాధిస్తే మిగతా మ్యాచ్‌లలో సులభంగా గెలుపొందచ్చనే సెంటిమెంట్‌ను నమ్ముతున్నట్లు కొందరు క్రికెటర్లు పేర్కొన్నారు. ఈ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. అభిమాన ఆటగాళ్లు శిఖర్‌ధావన్, యూసుఫ్‌పఠాన్, భువనేశ్వర్, అలెక్స్‌ హేల్స్‌పై హైదరాబాదీలు ఆశలు పెట్టుకున్నారు. ఈసారి అంతా యంగ్‌ ప్లేయర్స్‌నే ఉండడంతో సన్‌రైజర్స్‌ కప్‌ గెలుస్తుందనే ధీమా సిటీజనుల్లో ఉంది.

ప్రత్యేక స్క్రీన్లు...  
ఐపీఎల్‌ జోష్‌ను సిటీజనులకు అందించేందుకు పబ్బులు, క్లబ్బులు, రెస్టారెంట్లు సిద్ధమవుతున్నాయి. ప్రత్యేకంగా  స్క్రీన్లు, ప్రొజెక్టర్లు, టీవీలు ఏర్పాటు చేస్తున్నాయి. ఎంచక్కా చుక్కేస్తూ.. ముక్క రుచిని ఆస్వాదిస్తూ ఆటను తిలకించొచ్చు. ‘ఐపీఎల్‌ దృష్ట్యా మా పబ్‌లో రెండు ప్రధాన ప్రొజెక్టర్లు, 19 ఎల్‌ఈడీ టీవీలను అమర్చామ’ని చెప్పారు మాదాపూర్‌లోని స్పోర్ట్స్‌ పబ్‌ అండ్‌ రెస్టారెంట్‌ నిర్వాహకులు కీర్తి. 

ఫ్యాన్స్‌ వెయిటింగ్‌...
అభిమాన క్రీడాకారులను చూసేందుకు ఫ్యాన్స్‌ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎంఎస్‌ ధోనీ, కోహ్లీ, శిఖర్‌ ధావన్, యువరాజ్‌ సింగ్, హర్భజన్‌సింగ్, రోహిత్‌శర్మ, యూసుఫ్‌పఠాన్‌ తదితర ప్రధాన ఆటగాళ్లు ఇక్కడ సందడి చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లు త్వరితగతిన అమ్ముడవుతున్నాయి. విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి తదితర నగరాల నుంచి క్రీడాభిమానులు నగరానికి చేరుకుంటున్నారు. ఈ నెల 22న (ఆదివారం) చెన్నై సూపర్‌కింగ్స్‌తో సన్‌రైజర్స్‌ తలపడనుంది. మిగతా మ్యాచ్‌లతో పోలిస్తే ఇది ప్రత్యేకంగా నిలవనుంది. ఎందుకంటే ధోనీ ఉంటాడు కాబట్టి... ఇప్పటికే మ్యాచ్‌ టికెట్లు అమ్ముడయ్యాయని నిర్వాహకులు తెలిపారు. 

                                      చీర్‌ గర్ల్స్‌
బలంగా ఉంది..  
మన టీమ్‌ ఈసారి చాలా బలంగా ఉంది. మంచి బ్యాట్స్‌మెన్, బౌలర్లు ఉన్నారు. ఈసారి కచ్చితంగా కప్‌ గెలుస్తుందనే నమ్మకం ఉంది. ఐపీఎల్‌ గ్రామీణ క్రీడాకారులకు ఒక వరం లాంటిది. ఇక్కడ ప్రతిభ కనబరిస్తే జాతీయ జట్టులో చోటు సంపాదించడం సాధ్యమవుతుంది.   – సునీల్‌బాబు, క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ సెక్రటరీ 

యంగ్‌ అండ్‌ డైనమిక్‌..  
గతంతో పోలిస్తే ఈసారి మన టీమ్‌ యంగ్‌ ప్లేయర్స్‌తో కళకళలాడుతోంది. ఐపీఎల్‌ వారందరికీ ఓ ప్లాట్‌ఫామ్‌. గతేడాదితో పోలిస్తే ఈసారి ఇండియన్‌ క్రికెటర్లకే ఐపీఎల్‌లో ఎక్కువ ప్రాధాన్యం లభించింది.  
– షాలినీ, నేషనల్‌ క్రికెట్‌ ప్లేయర్‌

వరుణుడు కరుణించేనా?
నగరంలో రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో సోమవారం కూడా భారీ ఈదురుగాలులు వీచే, వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే భారీ వర్షం వస్తే తప్ప.. మ్యాచ్‌ రద్దయ్యే అవకాశం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. వర్షం వస్తే పిచ్‌ తడవకుండా ఉండేందుకు స్టేడియం సిబ్బంది పనుల్లో నిమగ్నమయ్యారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మ్యాచ్‌ జరుగుతుందా? లేదా? సందిగ్ధంలోఅభిమానులున్నారు.  

ఉప్పల్‌లో జరిగే మ్యాచ్‌లివే...
సన్‌రైజర్స్‌ (vs) రాజస్థాన్‌ రాయల్స్‌    9/4/18  
సన్‌రైజర్స్‌ (vs) ముంబై ఇండియన్స్‌    12/4/18  
సన్‌రైజర్స్‌ (vs)చెన్నై సూపర్‌కింగ్స్‌    22/4/18  
సన్‌రైజర్స్‌ (vs) కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 26/4/18  
సన్‌రైజర్స్‌ (vs) ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ 5/5/18  
సన్‌రైజర్స్‌ (vs) రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌    7/5/18  
సన్‌రైజర్స్‌ (vs) కోల్‌కతా నైట్‌రైడర్స్‌    19/5/18 

మరిన్ని వార్తలు