హాస్టల్‌లో గంజాయి కలకలం

23 Feb, 2018 08:57 IST|Sakshi
పట్టుబడిన గంజాయి, ఫర్నిచర్‌ను ధ్వంసం చేస్తున్న విద్యార్థి సంఘం నాయకులు

ఓ ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాల హాస్టల్‌ గదిలో

100కేజీల గంజాయి దాచిన వార్డెన్‌

విద్యార్థి సమాచారంతో గుట్టురట్టు పరారీలో కళాశాల వార్డెన్‌

సూర్యాపేటటౌన్‌ : జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలో బుధవారం అర్ధరాత్రి దాటాక గంజాయి దొరకడంతో ఒక్కసారిగా కలకలంరేగింది. పట్ట ణంలోని గాయత్రి జూనియర్‌ కళాశాల హాస్టల్‌లో అర్ధరాత్రి 100 కేజీల గంజాయి పట్టుబడింది. వివరాల ప్రకారం.. గాయత్రి కళాశాలకు సమీపంలో హాస్టల్‌ను బాలుర కోసం ఏర్పాటు చేశారు. అయితే రోజు మాది రిగానే కళాశాల విద్యార్థులు సాయంత్రం హాస్టల్‌కు వచ్చి స్టడీ అవర్స్‌లో 10.30 గంటల వరకు ఆరు బయటనే చదువుకున్నారు. కళాశాల వార్డెన్‌ లింగయ్య 12 కాటన్ల గంజాయిని ఓ ఆటోలో తీసుకొచ్చి కళాశాల హాస్టల్‌లోని విద్యార్థుల మంచాల కింద దాచి పెట్టాడు. గమనించిన విద్యార్థులు ఏమిటని వార్డెన్‌ను అడుగగా పరీక్ష పేపర్లని చెప్పి బయటికి వెళ్లాడు. విద్యార్థులకు అనుమానం వచ్చి కాటన్లను తెరిచి చూశారు. ఒక్కసారిగా గుప్పుమని గంజాయి వాసన రావడంతో అందులో ఒక విద్యార్థి వారికి తెలిసిన విద్యార్థి సంఘం నాయకులకు సమాచారం ఇచ్చారు.

విద్యార్థి సంఘాల ధర్నా..
గంజాయి కళాశాల వసతి గృహంలో ఉందని తెలియడంతో టీజీవీపీ,  టీవైఎస్‌ విద్యార్థి సంఘం నాయకులు కళాశాల హాస్టల్‌కు వెళ్లి సుమారు 100కేజీల గంజాయి కాటన్లను బయటికి తెచ్చి ధర్నాకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని 12 కాటన్ల గంజాయిని సీజ్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. సుమారు 200మంది విద్యార్థులు ఉండే హాస్టల్‌లో గంజాయి లభ్యం కావడంతో ఒక్కసారిగా విద్యార్థులు ఉలిక్కిపడ్డారు.

పరారీలో హాస్టల్‌ వార్డెన్‌..
గంజాయిని హాస్టల్‌లో దాచిన వార్డెన్‌ లింగయ్య ఈ విషయం బయటికి పొక్కడంతో వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ శివశంకర్‌ వార్డె¯Œన్‌తో వచ్చిన వారి వివరాలను ఆరా తీశారు. గంజాయి మూలాలపై లోతుగా విచారణ చేపట్టి నిందితుడిని వెంటనే పట్టుకుంటామని సీఐ తెలిపారు.

మాకు ఎలాంటి సంబంధం లేదు :   కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌
తమ కళాశాల హాస్టల్‌లో గంజాయి దొరికిందని తెలియడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాను. మూడు నెలల క్రితమే కళాశాల హాస్టల్‌లో వార్డెన్‌గా తేజావత్‌ లింగయ్యను పెట్టుకున్నాం. అయితే లింగయ్య గంజాయి దందా చేసినట్లు తెలిసింది. రాత్రి కళాశాలకు చేరుకునే సరికి వార్డెన్‌ లింగయ్య పరారయ్యాడు. కళాశాల యాజమాన్యానికి గంజాయికు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఇదంతా వార్డెన్‌ లింగయ్య దొరికితే బయటపడుతుంది.

వార్డెన్‌పై కేసు నమోదు
సూర్యాపేట క్రైం : కళాశాలలో 100 కేజీలకు పైగా గంజాయిని అక్రమంగా  నిల్వ ఉంచిన హాస్టల్‌ వార్డెన్‌ తేజావత్‌ లింగయ్యపై ప్రిన్సిపాల్‌ చామకూరి శ్రీనివాస్‌ ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శివశంకర్‌తెలిపారు.

కళాశాల ఫర్నిచర్‌ ధ్వంసం...
అభం శుభం తెలియని విద్యార్థుల పక్కన గంజాయిపెట్టి వారి జీవితాలతో చెలగాటమాడిన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకొని గుర్తింపును వెంటనే రద్దు చేయాలని తెలంగాణ విద్యార్థి పరిషత్‌ ఆధ్వర్యంలో కళాశాల ఎదుట ధర్నా చేశారు. ధర్నాలో భాగంగా కళాశాలలోని అద్దాలు, కుర్చీలను పగులగొట్టి ధ్వంసం చేశారు. వెంటనే కళాశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఫర్నిచర్‌ను« ధ్వంసం చేయడంతో వెంటనే సీఐ శివశంకర్‌ సిబ్బందితో కలిసి చేరుకొని కళాశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీజీవీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నావత్‌ వంశీ, అహ్మద్‌అలీ, చాంప్లా, అశోక్, శివ, ఠాగూర్, మణి,సాయి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు