ఎయిర్‌పోర్టులో 1.24 కేజీల బంగారం పట్టివేత

31 Mar, 2018 03:23 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న బంగారం

శంషాబాద్‌: బంగారం అక్రమ రవాణాదారులు ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. విదేశాల నుంచి తీసుకొచ్చిన బంగారాన్ని విమానాశ్రయాల్లోని మరుగుదొడ్లలో దాచి దేశీయ ప్రయాణికుల ద్వారా బయటికి తరలిస్తున్నారు. ఈ నెల 27న ఇలాంటి సంఘటనే శంషాబాద్‌ విమానాశ్రయంలో చోటు చేసుకుందని కస్టమ్స్‌ అధికారులు శుక్రవారం రాత్రి వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ నెల 27న సాయంత్రం 4:30 గంటలకు ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడు విమానాశ్రయంలోని పురుషుల పరిశుభ్రత గది వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండగా, అతడిని గమనించిన కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో అక్రమ రవాణాదారులు దుబాయ్‌ నుంచి తీసుకొచ్చిన 1.24 కిలోల బంగారాన్ని టాయిలెట్‌ వద్ద దాచిపెట్టిన సంగతిని వెల్లడించాడు. దేశీయ ప్రయాణికుడిగా వచ్చిన తాను ఆ బంగారాన్ని బయటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలిపాడు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను రెడ్‌ చానల్‌ వద్ద అధికారులు తనిఖీ చేస్తుండడంతో అక్రమ రవాణాదారులు బంగారాన్ని ఎయిపోర్టులోని టాయిలెట్‌లో దాచి దేశీయ ప్రయాణికుల ద్వారా బయటికి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

మరిన్ని వార్తలు