అనుమానస్పద స్థితిలో ఇద్దరు వైద్యుల మృతి

4 Dec, 2019 18:52 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒకే ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు డాక్టర్లు బుధవారం ఉదయం కారులో విగతా జీవులాగా కనిపించారు. ఈ ఘటన ఢిల్లీలోని  రోహిణి ప్రాంతంలోని సెక్ట‌ర్ 13లో జ‌రిగింది. ప్రమాదంలో మృతి చెందిన వారిని డాక్టర్‌ ఓం ప్రకాశ్‌ కుక్రేజా(65), సుదీప్త ముఖర్జీ(55)గా పోలీసులు గుర్తించారు. ఇద్దరు డాక్టర్లు ఒకే ఆసుపత్రిలో పనిచేస్తున్నారని, ముందుగా మహిళా డాక్టర్‌పై తుపాకీతో కాల్పులు జరిపిన అనంతరం డాక్టర్‌ కుక్రేజా తనకు తాను కాల్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. వివాహితుడైన డాక్టర్‌ కుక్రేజా మహిళ డాక్టరుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, తాజాగా మహిళ డాక్టర్‌ తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు. 

మరిన్ని వార్తలు