లారీని ఢీ కొట్టిన మరో లారీ.. ఇద్దరు మృతి

22 Aug, 2019 08:30 IST|Sakshi

సాక్షి, విజయనగరం : రోడ్డుపై ముందు వెళ్తున్న లారీని మరో లారీ ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన బుధవారం అర్థరాత్రి  గజపతినగరం మండలం గుడివాడ  జంక్షన్ వద్ద 26వ నెంబర్‌ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం నుంచి సింగరోలి(మధ్యప్రదేశ్‌) కెమికల్స్ లోడుతో వెళుతున్న లారీ ముందు వెళ్తున్న మరో లారీని ఢీ కొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో  కెమికల్‌లోడ్‌ లారీ డ్రైవర్, క్లీనర్‌ అగ్నికి ఆహుతయ్యారు. రెండు లారీలు మంటలో కాలి బూడిదయ్యాయి. మృతులను డ్రైవర్ రామ్ సుందర్ యాదవ్( 34), క్లీనర్  ఓం ప్రకాశ్ సింగ్ (24)గా గుర్తించారు.

లారీ బీభత్సం.. వాహనాల ధ్వంసం
హైదరాబాద్‌ : విజయవాడ జాతీయ రహదారిపై లారీ బీభత్సం సృష్టించింది.  అబ్దుల్లాపూర్ మెట్టు రామోజీ ఫిల్మ్ సీటి ముందు అతి వేగంగా వచ్చిన ఓ లారీ పార్కింగ్ చేసిన కార్లపై దూసుకెళ్లి పల్టీ కొట్టింది. దీంతో 5 కార్లు ఒక బైక్ , హైవే పక్కన ఉన్న  తోపుడు బండ్లు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో కార్లలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

లారీ కిందపడి మహిళా కానిస్టేబుల్‌
తూర్పు గోదావరి : లారీ కిందపడి ఓ మహిళా కానిస్టేబుల్‌ మృతిచెందింది. పిఠాపురం నుండి రాజమండ్రి కోర్టుకు వెళుతుండగా రంగంపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలిని పిఠాపురం పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్‌గా గుర్తించారు.

రహదారిపై టైర్‌ పేలి..
కామారెడ్డి : మండలంలోని అడ్లూరు గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై టైర్ పేలి విద్యుత్ ఫిల్టర్ల లారీ దగ్దం అయ్యింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి హైదరాబాద్‌కు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలను గమనించిన డ్రైవర్‌  లారీని రోడ్డు పక్కకు నిలపడంతో భారీ ప్రమాదం తప్పింది.  అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే సమయానికే లారీ పూర్తిగా దగ్ధం అయ్యింది. లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లింది.

మరిన్ని వార్తలు