టోల్‌ప్లాజా వద్ద మహిళపై అఘాయిత్యం..

19 Feb, 2020 12:29 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చండీగఢ్ : టోల్‌ప్లాజా వద్ద మూత్రవిసర్జన కోసం వెళ్లిన  ఓ మహిళపై  ఇద్దరు కీచకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఘటనాస్థలంలో వారి మొబైల్‌ నంబర్లను ఇచ్చి మరీ వెళ్లిపోయారు. ఈ ఘటన హర్యానాలో ఫిబ్రవరి 16న చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పంజాబ్‌కు చెందిన భార్యాభర్తలు తమ బంధువులను కలవడానికి పానిపట్‌కు వెళ్లారు. అనంతరం ఆదివారం అక్కడి నుంచి బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో తమ సన్నిహితుల నుంచి రూ. 20000 తీసుకోవడానికి  రాత్రి 11 గంటల సమయంలో కర్నల్‌ టోల్‌ప్లాజా వద్ద ఆగారు. ఈ క్రమంలో సదరు మహిళ(19) మూత్రవిసర్జన కోసం  పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లింది.

ఇది గమనించిన స్థానికంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు మహిళను కత్తితో బెదిరించి నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లారు. అక్కడ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం మహిళను అక్కడే వదిలేసి దుండగులు పరారయ్యారు. అంతేగాక ఘటన ప్రాంతంలో వారి మొబైల్‌ నెంబర్లను వదిలి వెళ్లారు. ఎలాగోలా అక్కడి నుంచి బయటపడ్డ బాధిత మహిళ  భర్త దగ్గరికి వచ్చి.. తనకు జరిగిన ఘోరాన్నిచెప్పుకుని విలపించింది. దీంతో సోమవారం ఉదయం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలంలో లభించిన ఫోన్‌ నెంబర్ల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని టోల్‌ప్లాజా వద్ద చిప్స్‌ అమ్ముకునే మేఘరాజ్‌, సోనూలుగా గుర్తించారు. నిందితులను కోర్టులో హాజరు పరిచిన పోలీసులు అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు