నేను చనిపోవాలి.. నా భర్తను రక్షించండి

14 Dec, 2019 12:32 IST|Sakshi

ముంబై : ఆపద నుంచి కాపాడే పోలీసులే తమను సమస్యల్లోకి నెట్టారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సంబంధం లేని నేరాన్ని అంటగట్టి బలవంతంగా కేసులో ఇరికించాలని చూస్తున్నారని వాపోయారు. ‘నేను చనిపోవాలి అనుకుంటున్నాను. నా భర్తను మాత్రం రక్షించండి’ అంటూ ఎత్తైన భవంతి నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన మహరాష్ట్రలో శుక్రవారం చోటుచేసుకుంది. థానే జిల్లాకు చెందిన  23 ఏళ్ల మహిళ భర్తతో కలిసి ఉల్హాస్‌నగర్‌లో జ్యూస్‌ సెంటర్‌ను నడుపుతున్నారు. అయితే గత కొంత కాలంగా తనను, తన భర్తను  పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని, తమపై దాడికి పాల్పడ్డారని.. మహారాష్ట్ర సచివాలం అయిదవ అంతస్తు నుంచి దూకింది. అయితే  పోలీసులు అప్రమత్తమయ్యి రెండవ అంతస్తులో..  వల(నెట్‌) ఏర్పాటు చేయడంతో మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది. అనంతరం మహిళను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 

ఇక ఈ ఘటనపై మహిళ సోదరుడు స్పందిస్తూ.. తన సోదరి మరో మహిళతో కలిసి తమ సమస్యను అధికారులకు విన్నవించి.. న్యాయం జరిపించాలని శుక్రవారం సచివాలయానికి వెళ్లిందని తెలిపారు. అయితే తన వద్ద సరైన గుర్తింపు పత్రాలు లేకపోవడంతో అధికారులు లోపలికి వెళ్లనివ్వలేదని ఆరోపించారు. లోపల ఏం జరిగిందో తనకు తెలీదన్నారు. కాగా సోదరి, తన భర్తపై పాత స్నేహితులతో  కలిసి స్థానిక పోలీసులు దాడి చేశారని ఆరోపిస్తూ.. ఇప్పటికైనా తన సోదరికి న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు.

మరిన్ని వార్తలు